బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఎవరినీ అంత తేలికగా పొగడదని అంటారు. అయితే అందులో వాస్తవం లేదు. తన భావాలను వ్యతిరేకించే వారిని విమర్శించడంలో ముందుండే కంగనా రనౌత్, కొందరిని మాత్రం ఎలాంటి సంకోచం లేకుండా పొగుడుతూ ఉంటుంది. ఇటీవల అదే జరిగింది. దర్శకుడు మిలన్ లూధ్రియా ‘ది డర్టీ పిక్చర్’ను తొలుత కంగనా రనౌత్ తోనే తీయాలనుకున్నాడు. కానీ ఆమె అంగీకరించకపోవడంతో ఆ పాత్ర విద్యాబాలన్ కు లభించింది. ఆ సినిమాతో విద్యా బాలన్ జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా అవార్డును అందుకుంది. ‘ది డర్టీ పిక్చర్’ కంటే ముందు మిలన్.. కంగనాతో ‘వన్స్ అపానే టైమ్ ఇన్ ముంబై’ మూవీ చేశాడు. ఆ కారణంగానే ‘ది డర్టీ పిక్చర్’ ఆఫర్ కూడా కంగనాకు ఇచ్చాడు. అయితే… ఈ సినిమా పొటన్షియాలిటీని గుర్తించడంలో తాను విఫలమయ్యానని, అందుకు ఇప్పుడేమీ బాధపడటం లేదని కంగనా తెలిపింది. విద్యాబాలన్ అందులో సిల్క్ స్మిత పాత్రకు సంపూర్ణ న్యాయం చేకూర్చిందని, ఆ పని తనవల్ల కాదని కూడా కంగనా అంగీకరించింది. విశేషం ఏమంటే… అప్పుడు సిల్క్ స్మిత బయోపిక్ ను తిరస్కరించిన కంగనా రనౌత్ ఇప్పుడు దక్షిణాది నాయిక, తమిళనాడు మాజీ సీఎం, దివంగత జయలలిత బయోపిక్ ‘తలైవి’ లో నటించింది. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఇటీవలే ‘మణికర్ణిక, పంగా’ చిత్రాలకు గానూ ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు అందుకున్న కంగనాకు ‘తలైవి’ సైతం అవార్డును అందిస్తుందేమో చూడాలి.