మహారాష్ట్రలోని నలసోపారా పట్టణంలో నివసిస్తున్న 80 ఏళ్ల గణపత్ నాయక్ కి మహరాష్ట్ర ఎలక్ట్రిసిటీ బోర్డ్ అధికారులు షాకిచ్చారు. ఇటీవల దాదాపు 80 కోట్ల రూపాయల విద్యుత్ బిల్లు అందుకున్న తరువాత ఆయనకు హై బీపీ పెరగడంతో ఆయనను ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మహరాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఎంఎస్ఇడిసిఎల్) విద్యుత్ బిల్లును సరిచేసింది. బిల్లులో పేర్కొన్న ఈ ఎనభై కోట్ల అధిక మొత్తం టైపింగ్ మిస్టేక్ ఫలితంగా వచ్చిందని పేర్కొన్నారు. ఫిబ్రవరి 22 న దాదాపు 80 కోట్ల రూపాయల విద్యుత్ బిల్లు అందుకున్న గణపత్ నాయక్ నివ్వెరపోయాడు. హై బీపీతో పడిపోవడంతో చివరికి, అతన్ని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకెళ్లవలసి వచ్చింది. నాయక్ మనవడు నీరజ్ మీడియాతో మాట్లాడుతూ బిల్లులో పేర్కొన్న మొత్తాన్ని చూసి వారు షాక్ అయ్యారని చెప్పారు. “మొదట, వారు మాకు మొత్తం జిల్లా బిల్లును పంపించారని నేను అనుకున్నాను. అనుమానం వచ్చి మళ్ళీ చెక్ చేశాము, అది మా బిల్లు అని తేలింది. ఇక ఈ 80 కోట్ల విద్యుత్ బిల్లు గురించి వార్తలు వచ్చిన నేపధ్యంలో బిల్లును సరిచేయడానికి ఎంఎస్ఇడిసిఎల్ ఒక అధికారిని పంపింది.