కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ మరణ వార్త విని బాలకృష్ణ ఎమోషనల్ అయ్యారు. విషయం తెలియగానే ఆయన బెంగుళూర్కు వెళ్లారు. శనివారం కంఠీరవ స్టేడియానికి వెళ్లి పునీత్ పార్థీవ దేహానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన పునీత్ రాజ్కుమార్ సోదరుడిని పరామర్శిస్తూ ఎమోషనల్ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన బాలయ్య పునీత్ మన మధ్య లేడన్న వార్తను నమ్మలేకపోతున్నాని, వ్యక్తిగతంగా తనకు తీరని లోటని బాలయ్య అన్నారు. రాజ్కుమార్ కుటుంబంతో ఎంతో అనుబంధం ఉందన్న బాలయ్య ఒక తల్లి కడుపున పుట్టకపోయినా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండేవాళ్లమని ఈ సందర్భంగా బాలయ్య అన్నారు. హరికృష్ణ మరణం తర్వాత బాలయ్య కన్నీరు పెట్టింది కూడా ఇప్పుడే ..హరికృష్ణ మరణంతో బాలయ్య ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. ఆ తర్వాత పునీత్ మరణం తర్వాత బాలయ్య అంతలా కంటతడి పెట్టారు.
ఓ సినిమా ఫంక్షన్లో పునీత్ మాట్లాడుతూ .. శివరాజ్ తర్వాత నాకు అన్నయ్య బాలయ్య అని చెప్పిన సందర్భాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. మరో ఫంక్షన్లో పునీత్ బాలయ్య చెంపమీద ఏదో పడితే క్లీన్ చేశాడు. ఇది వారిద్దరి మధ్య ఎంత మంచి అనుబంధం ఉందో తెలియజేస్తుంది. వీరి అనుబంధాన్ని ప్రతిబింబించే వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
తను నటించిన ఎన్టీఆర్ సినిమా ప్రమోషన్స్కి కూడా పునీత్ వచ్చాడని గుర్తు చేసుకున్నాడు. ఒక కళాకారుడిగా, మంచి మనిషిగా ఆయన జనాల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నట్టు బాలయ్య చెప్పారు. బాలకృష్ణతోపాటు టాలీవుడ్కు చెందిన చాలా మంది ప్రముఖులు పునీత్ పార్థీవ దేహాన్ని చూసేందుకు బెంగుళూరుకు వెళ్లారు. బాలయ్య చేరుకున్న కాసేపటికే ఎన్టీఆర్ కూడా చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. పునీత్ సోదరుడు శివరాజ్కుమార్ను హత్తుకుని ఓదార్చారు.