సీఎం కేసీఆర్ పై మరోమారు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పెద్ద రైతునని చెప్పుకునే కేసీఆర్ మొద్దు నిద్ర పోతుండంటూ ఎద్దేవా చేశారు. 2 నెలలుగా ధాన్యం కల్లాల్లో పెట్టుకొని రైతులు కన్నీళ్లు పెడుతున్నా దొరకు కనిపించడం లేదని ఆగ్రహించారు. వడ్లు కొనకుండా ఇక్కడ ధర్నాలు, ఢిల్లీలో డ్రామాలు చేయడంతో మరో రైతు గుండె ఆగిపోయిందని పేర్కొన్నారు. అయ్యా కేసీఆర్ ఇంకెంత మంది చస్తే వడ్లు కొంటారని నిలదీశారు.
ఇంకెంతమంది రైతుల ఉసురు తీస్తే మీ కండ్లు చల్లబడుతాయి? అని ఫైర్ అయ్యారు. కల్లాల్లో ఉన్న రైతును కాటికి పంపుతున్నావ్ ? అంటూ నిప్పులు చెరిగారు. యాసంగి పంటలతో బిజీగా ఉండాల్సిన రైతును పాడె ఎక్కిస్తున్నారని కేసీఆర్ పై మండిపడ్డారు. వడ్లు కొనమని కాళ్ళు మొక్కించుకుంటున్నవ్.. మీది రైతు ప్రభుత్వం కాదు, రైతును కాల్చుకు తింటున్న రైతు పాలిట రాబంధు ప్రభుత్వం అంటూ నిప్పులు చెరిగారు.