NTV Telugu Site icon

అప్పుడు భూమిక… ఇప్పుడు పూజ

చిత్ర విచిత్రమైన సంఘటనలకు మన సినిమా పరిశ్రమ వేదిక అవుతూ ఉంటుంది. అలాంటి సంఘటనలు తలచుకుంటే ఆశ్చర్యం కలగక మానదు. తాజాగా అలాంటి యాదృచ్చికమైన విషయాన్ని గుర్తు చేసుకుందాం. ఈ సంఘటనకు కారకులు భూమిక, పూజాహేగ్డే కావటం విశేషం.

2000లో ‘యువకుడు’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింద భూమిక. ఆ తర్వాత ఏడాదే పవన్ కళ్యాణ్ తో ‘ఖుషీ’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా సూపర్ హిట్ అవటంతో భూమికకు వెనుదిరిగి చూసుకునే అవసరం లేకపోయింది. అయితే ‘ఖుషీ’ పవన్ కి 7వ సినిమా. ఆ తర్వాత 2003లో మహేశ్ బాబుతో ‘ఒక్కడు’, ఎన్టీఆర్ తో ‘సింహాద్రి’ సినిమాల్లోనూ హీరోయిన్ గా నటించింది భూమిక. ఆ సినిమాలు మహేశ్, ఎన్టీఆర్ కి 7వ సినిమాలు కావటం అవి రెండు కూడా సూపర్ డూపర్ హిట్ కావటం గమనార్హం. ఇలా ముగ్గురు హీరోల 7వ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ కావటం… అందులో భూమిక హీరోయిన్ కావటమే అసలు సిసలు ట్విస్ట్.

ఇక ప్రస్తుతానికి వస్తే 2014లో ‘ఒక లైలా కోసం’ సినిమాలో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది పూజా హేగ్డే. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ తెలుగునాట స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించుకుంది. 2018లో ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమాలో నాయికగా నటించటం… అది హిట్ కావటం జరిగింది. ఈ సినిమా హీరోగా ఎన్టీఆర్ కి 28వ చిత్రం. గత ఏడాది ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ‘అల వైకుంఠపురం’లోనూ పూజనే హీరోయిన్. ప్రస్తుతం ‘రాధేశ్యామ్, ఆచార్య’ వంటి సినిమాలో పాటు తమిళంలో ‘బీస్ట్’, బాలీవుడ్ లో ‘సర్కస్, భాయిజాన్’ సినిమాల్లో నటిస్తోంది. వాటితో పాటు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్ బాబు నటించే సినిమాలోనూ, హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించే సినిమాలోనూ పూజనే హీరోయిన్ గా కన్ ఫామ్ చేశారు. ఈ రెండు సినిమాలు మహేశ్, పవన్ కళ్యాణ్ కి 28వ సినిమాలు కావటం విశేషం. సో అప్పట్లో ఈ ముగ్గురు హీరోల 7వ సినిమాలో భూమిక హీరోయిన్ కాగా… ఇప్పుడు 28వ సినిమాలో పూజా హేగ్డే కథానాయిక. అప్పుడు భూమిక నటించిన ఈ ముగ్గురు హీరోల సినిమా సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు పూజ నటించిన ఎన్టీఆర్ 28వ సినిమా ‘అరవింద సమేత’ ఘనవిజయం సాధించింది. సెంటిమెంట్ గా మహేశ్, పవన్ సినిమాలు కూడా సూపర్ హిట్ అవుతాయేమో చూద్దాం.