పెట్రోల్, డీజిల్ ధరలు.. రోజురోజుకీ సామాన్యుడికి భారంగా మారుతున్నాయి.. పెట్రో ఉత్పత్తుల ధరలను జీఎస్టీ పరిధిలోకి తేవాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది.. ఇక, జీఎస్టీ కౌన్సిల్ సమవేశం జరిగిన ప్రతీసారి.. పెట్రో ధరలను జీఎస్టీ పరిధిలోకి తెచ్చే అవకాశం ఉందనే ప్రచారం సాగుతూనే ఉంది.. కానీ, ఆ ఉద్దేశమే లేదనేది తాజా ప్రకటనతో స్పష్టం అయ్యింది.. ఎందుకుంటే.. ఆ దిశగా జీఎస్టీ కౌన్సిల్ సిఫార్సు చేయలేదని స్పష్టం చేశారు పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్సింగ్ పూరీ.. లోక్సభలో పెట్రో ధరలపై స్పందించిన ఆయన.. పెట్రో ఉత్పత్తుల ధరలు దేశవ్యాప్తంగా ఒకే విధంగా ఉండేలా చేసే పథకమేదీ కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో లేదని క్లారిటీ ఇచ్చారు.. రవాణా ఛార్జీలు, వ్యాట్, స్థానిక పన్నులు వేర్వేరుగా ఉన్నందున పెట్రో ఉత్పత్తుల ధరలు ఆయా ప్రాంతాల్లో వేర్వేరుగా ఉన్నాయని తెలిపిన ఆయన.. అసలు పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు.. జీఎస్టీ కౌన్సిల్ సిఫారసు చేయలేదని తెలిపారు.