బుధవారం రోజు టీటీడీ కీలక ప్రకటన చేసింది. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ఆన్లైన్లో టిక్కెట్లు బుక్ చేసుకున్న వారు తమ ప్రయాణాలను వారం రోజుల పాటు వాయిదా వేసుకోవాలని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు. దర్శనం టిక్కెట్లను రీ షెడ్యూల్ చేసుకునే వెసులుబాటును త్వరలోనే కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. దర్శనం టికెట్లు ఉన్నవారు వచ్చే ఆరు నెలల్లో ఎప్పుడైనా దర్శనం చేసుకోవచ్చని సూచించారు.
Read Also: విరిగిపడ్డ కొండ చరియలు.. ఘాట్ రోడ్డు మూసివేత.. !
మరోవైపు తిరుమల ఘాట్ రోడ్డులో బుధవారం ఉదయం కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. 20 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా వర్షాలు కురవడంతో తిరుమల ఘాట్రోడ్డులో భారీ స్థాయిలో కొండచరియలు విరిగిపడ్డాయన్నారు. నాలుగు ప్రాంతాల్లో పూర్తిగా రోడ్డు దెబ్బతినడంతో రహదారి రిపేర్ కోసం ఢిల్లీ నుంచి ఐఐటీ నిపుణులను పిలిపిస్తున్నామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. రహదారి పునరుద్ధరణకు మరో మూడు రోజుల సమయం పడుతుందన్నారు. అందువల్ల భక్తులు దర్శనం వాయిదా వేసుకుంటే మంచిదని హితవు పలికారు.