తెలంగాణ రాజకీయాల్లోకి ప్రవేశించిన సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రాజీనామాపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. నేడు హైకోర్టు లో సిద్దిపేట మాజీ కలెక్టర్ రాజీనామాపై విచారణ జరగనుంది. వెంకట్రామిరెడ్డి రాజీనామాను ఆమోదించడాన్ని సవాల్ చేస్తూ పిల్ దాఖలు చేశారు. రీసెర్చ్ స్కాలర్ ఆర్.సుబేందర్ సింగ్, జె.శంకర్ వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారించనుంది. ఐఏఎస్ రాజీనామాను ఆమోదించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఐఏఎస్ లు కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటారన్న పిటిషనర్లు, వెంకట్రామిరెడ్డి నామినేషన్ ను ఆమోదించకుండా ఆదేశాలివ్వాలని కోరారు. ఈసీ, శాసనమండలి కార్యదర్శి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రతివాదులుగా పేర్కొన్నారు పిటిషనర్లు. దీనిపై విచారించనుంది హైకోర్టు. వెంకట్రామిరెడ్డిని ఎమ్మెల్సీగా ఎంపికచేసింది అధికార టీఆర్ఎస్ పార్టీ. ఎన్నికల అధికారులు కూడా ఆయన ఎన్నికైనట్టు సర్టిఫికెట్ కూడా అందచేసిన సంగతి తెలిసిందే. కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.