టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కు పండగ మొదలైంది. దసరా సీజన్ దగ్గరపడుతోంది. ఈ సీజన్లో కొన్ని సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ వారాంతంలో ఒకేసారి నాలుగు సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. వైష్ణవ్ తేజ్ నటించిన “కొండపొలం”, గోపీచంద్ “ఆరడుగుల బుల్లెట్” ఈ శుక్రవారం విడుదలవుతున్నాయి. సెన్సిబుల్ ఫిల్మ్ మేకర్ క్రిష్ దర్శకత్వం వహించిన “కొండపొలం” వైష్ణవ్ తేజ్ కు రెండవ సినిమా. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలై ఆకట్టుకుంది. క్రిష్ కూడా సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నాడు. ఆయన “కొండపొలం” చిత్రానికి దర్శకత్వం వహించడానికి “హరి హర వీర మల్లు” నుండి విరామం తీసుకున్నట్లు ఇటీవల సినిమా ఆడియో రిలీజ్ వేడుకలో వెల్లడించారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన అన్ని డీల్స్ క్లోజ్ అయ్యాయి. ఈ సినిమా అక్టోబర్ 8న విడుదలకు రెడీగా ఉంది. “ఉప్పెన” లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వైష్ణవ్ తేజ్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.
Read Also : సమంత విడాకులపై మౌనం వీడిన తండ్రి
మరోవైపు మాచో హీరో గోపీచంద్ “ఆరడుగుల బుల్లెట్” అంటూ థియేటర్లలో సందడి చేయబోతున్నాడు. నిజానికి ఈ సినిమా ఎప్పుడో పూర్తయ్యింది. కానీ పలు కారణం వల్ల ఇంకా విడుదలకు నోచుకోలేదు. ఇప్పటికే చాలా ఆలస్యమైన ప్రాజెక్ట్ “ఆరడుగుల బుల్లెట్”ను ఎట్టకేలకు విడుదల చేయడానికి ముందుకొచ్చారు మేకర్స్. ఇటీవల గోపీచంద్ నటించిన స్పోర్ట్స్ డ్రామా “సీటిమార్” రిలీజ్ అయ్యి మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో ఇదే మంచి సమయం అని భావించిన “ఆరడుగుల బుల్లెట్” మేకర్స్ వెంటనే సినిమా విడుదల తేదిని ప్రకటించారు. “ఆరడుగుల బుల్లెట్” కూడా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ “ఆరడుగుల బుల్లెట్” కమర్షియల్ అంశాలతో కామెడీ ఎంటర్టైనర్ గా అలరించింది. “ఆరడుగుల బుల్లెట్”లో నయనతార హీరోయిన్.
ఇక ఇదే రోజున “నేను లేని నా ప్రేమకథ”, తమిళ హీరో శివకార్తికేయన్ నటించిన “డాక్టర్” విడుదల కానున్నాయి. ఈ వారాంతంలో నాలుగు సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి అన్నమాట.