చోరీ జరిగింది అంటే ఎంత బంగారు పోయింది.. ఎంత డబ్బులు పోయాయి అని అడిగేవారు.. కానీ ఇప్పుడు మాత్రం ఎన్ని కేజిల టమోటాలు పోయాయి అని చర్చలు జరుగుతున్నాయి.. దొంగలు కూడా ఇప్పుడు రూటు మార్చుకున్నారు.. ధరలు పెరగడంతో ఎక్కువగా టమోటాలను ఎత్తుకెళ్తున్నారు.. దేశంలో పలు చోట్ల టమాటాలు చోరికి గురవుతున్నాయి.. దాంతో కూరగాయలు షాప్ యజమానులు సెక్యూరిటీని కూడా పెట్టుకుంటున్న ఘటనలను మనం చూస్తూనే ఉన్నాం.. తాజాగా మరో చోరీ వెలుగులోకి వచ్చింది.. కొందరు దుండగులు అర్ధరాత్రి 2 కూరగాయల షాపుల్లకి ప్రవేశించి టమాటాలు, పచ్చి మిర్చి, అల్లం ఎత్తుకెళ్లారు. ఈ కేసులో ఇద్దరు అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు..
వివరాల్లోకి వెళితే.. ఈ చోరీ ఉత్తరప్రదేశ్లోని ఫతేపూర్ జిల్లాలోని మార్కెట్ ప్రాంతంలో వెలుగు చూసింది.రెండు దుకాణాల్లో జరిగిన ఈ చోరీ ఉదంతం గురువారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫతేపూర్ జిల్లాలోని మార్కెట్ ప్రాంతంలోని రెండు దుకాణాల్లో జూలై 10 చోరీ జరిగింది. షాపు యజమానులు రామ్జీ, నయీమ్ఖాన్ ఇద్దరూ దుకాణాలు మూసివేసి రాత్రి ఇంటికి వెళ్లారు. మరుసటి రోజు ఉదయం తమ దుకాణాలు తెరిచి ఉండటం చూసి షాక్కు గురయ్యారు. షాపులోకి వెళ్లి తనిఖీ చేయగా టమోటాలు, అల్లం, మిరపకాయలు చోరీకి గురైనట్లు గ్రహించారు.. దాంతో పోలీసులను ఆశ్రయించారు..
ఆ దుకాణాల్లో దాదాపు 26 కిలోల టమోటాలు, 25 కిలోల మిర్చి, 8 కిలోల అల్లం చోరీకి గురైనట్లు పోలీసులు గురువారం తెలిపారు. ఈ కేసుకు సంబంధించి కమతా ప్రసాద్, మహ్మద్ ఇస్లాం అనే ఇద్దరు అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వార్తను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.. ఈ పోస్ట్ వైరల్ కావడంతో సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ రాష్ట్ర పోలీసులపై విరుచుకుపడ్డారు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ పేరును ‘స్పెషల్ టొమాటో ఫోర్స్’గా మార్చాలని సూచించారు.. మొత్తానికి ఈ పోస్ట్ వైరల్ అవ్వడంతో నెట్టింట పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి..