NTV Telugu Site icon

గులాబీకి చెక్‌ పెట్టే ఆలోచనలో కాషాయం..

కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలంటూ టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి నిరసనగా ధర్నాకు పిలుపునిచ్చారు. అయితే బీజేపీ నేతలేమో ధాన్యం కొనుగోలు చేతకాకనే కేంద్రంపై ఆరోపణలకు దిగుతున్నారని విమర్శిస్తున్నారు. ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌, అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతల మాటలతో రైతుల్లో గందరగోళం నెలకొంది.

స్వరాష్ట్ర సాధన కోసం పోరాడిన టీఆర్‌ఎస్‌కు పోరాటాలు కొత్తకావంటూ.. రైతుల కోసం పోరాటం చేస్తామంటూ అధికార పార్టీ నేతలు రోడ్లెక్కారు. అయితే తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యమ్నాయంగా బీజేపీ అవతరించిందని.. అందుకే బీజేపీని తెలంగాణలో బలపడకుండా చేసేందుకే.. బీజేపీని ఇరుకునపెట్టేందుకు కేసీఆర్‌ వ్యూహరచన చేశాడని రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి.

ఇదిలా ఉంటే.. కేంద్ర ప్రభుత్వంపైన రైతుల్లో అపనమ్మకం కలిగించేందుకు కేసీఆర్‌ చేస్తున్న వ్యూహాలను తిప్పికొట్టేందుకు బీజేపీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఓ రెండు రోజుల్లో కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో టీఆర్‌ఎస్‌ ప్లాన్‌కు ఎండ్‌ కార్డు వేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ ఇందుకు కావాల్సిన ప్రణాళికను సిద్ధం చేస్తారని బీజేపీలోని కొందరు అంటున్నారు. కాషాయం కర్తల వ్యూహాలు.. టీఆర్‌ఎస్‌కు చెక్‌ పెడుతాయా..? చూడాలి మరి..