తెలంగాణ రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీలతో చీఫ్ ఎలక్టోరల్ అధికారి శశాంక్ గోయల్ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో ప్రత్యేక ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై చర్చ జరిగింది. అనంతరం ఓటర్ల జాబితా ముసాయిదాను ప్రకటించారు. నవంబర్ 1, 2021న ప్రకటించిన ఓటర్ల జాబితా ప్రకారం తెలంగాణలో 3,08,75,744 మంది ఓటర్లున్నారు. ఈ జాబితాలో పురుషులు 1,52,57,690 మంది, మహిళలు 1,50,97,292 మంది, థర్డ్ జెండర్ 1,683 మంది, సర్వీస్ ఓటర్లు 14,501 మంది, ఎన్నారై ఓటర్లు 2,742 మంది, పీడబ్ల్యూడీ ఓటర్లు 5,01,836 మంది ఉన్నారు.
Read Also: తెలంగాణలో మరో సీనియర్ రాజకీయ నాయకుడి పాదయాత్ర
మరోవైపు తెలంగాణ ఓటు హక్కు లేని వారికి ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. దీని కోసం ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టింది. ఈనెల 6,7,27,28 తేదీల్లో ఓటరు నమోదు కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఈసీ వెల్లడించింది. మరోవైపు సోమవారం నుంచి ఈనెల 30 వరకు ఓటర్ల అభ్యంతరాలను స్వీకరిస్తామని తెలిపింది. జనవరి 5, 2022న ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తామని పేర్కొంది. కాగా ఇటీవల ఉప ఎన్నికలు జరిగిన హుజూరాబాద్ నియోజకవర్గంలో ముసాయిదా ఓటర్ల జాబితాను ఈ నెల 6న ప్రకటించనున్నారు. ఈ జాబితాపై అభ్యంతరాలు, విజ్ఞప్తులను డిసెంబరు 6 వరకు స్వీకరిస్తామని ఎన్నికల అధికారులు తెలిపారు.