హైదరాబాద్ ట్యాంక్బండ్లో గణేష్ నిమజ్జనానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. ఇప్పటి వరకు నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.. ఇక, ఈ నెల 19వ తేదీన నిర్వహించే గణేష్ శోభాయాత్ర, గణేష్ నిమర్జనానికి చకచకా ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం.. నిమజ్జన ఏర్పాట్లకు ఉన్న అడ్డంకులు అన్ని తొలగిపోయాయని పేర్కొన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. శోభాయాత్ర, విగ్రహాల నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా పోలీసు, ట్రాపిక్ పోలీసు, జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, ఆర్ అండ్ బీ, ఎలక్ట్రికల్ తదితర అన్ని ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నట్టు వెల్లడించారు.. శోభాయాత్ర, నిమజ్జనం పర్యవేక్షణ కోసం వివిధ శాఖల అధికారులతో ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశామన్న ఆయన.. విగ్రహాల నిమజ్జనం జరిగే ప్రధాన నీటివనరు హుస్సేన్ సాగర్ పరిసరాలలో 24 క్రేన్లు ఏర్పాటు చేస్తున్నామని.. ఇక, జీహెచ్ఎంసీ పరిధిలో గుర్తించిన రిజర్వాయర్ లు, 25 చెరువులు, 25 బేబీ పాండ్స్ వద్ద మొత్తం 300 క్రేన్ లను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా వెంటనే స్పందించేవిధంగా 100 మంది గజ ఈతగాళ్లను సిద్ధం చేశామని తెలిపారు మంత్రి తలసాని.. నిమజ్జనం కోసం విగ్రహాలను తీసుకెళ్లేందుకు మండపాల నిర్వహకులకు అవసరమైన వివిధ రకాల వాహనాలు వెయ్యి వరకు జీహెస్ఎంసీ పరిధిలోని 10 పాయింట్స్ లలో అందుబాటులో ఉంచామన్న ఆయన.. వీటి పర్యవేక్షణ కోసం 30 మంది ఆర్టీఏ అధికారులు, ఇన్స్పెక్టర్ లను ఏర్పాటు చేశామని.. గణేష్ విగ్రహాల నిమజ్జనం జరిగే ప్రాంతాలలో, శోభాయాత్ర నిర్వహించే రహదారులలో ఎప్పటికప్పుడు పారిశుధ్య నిర్వహణ జరిగేలా 8,160 మంది సిబ్బందితో శానిటరీ సూపర్ వైజర్ లేదా SFA ల ఆధ్వర్యంలో 215 ప్రత్యేక బృందాలు సిద్ధం చేస్తున్నామన్నారు.. శోభాయాత్ర, నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించేందుకు 27,955 మంది వివిధ స్థాయిలలోని పోలీసు సిబ్బందితో పాటు గ్రే హ్యాండ్స్, ఆక్టోపస్ దళాల బందోబస్తులో పాల్గొంటాయన్నారు.. ఈ సంవత్సరం కూడా నాంపల్లి, లక్డీకాపూల్, ఖైరతాబాద్, సంజీవయ్య పార్క్, జేమ్స్ స్ట్రీట్, బేగంపేట రైల్వే స్టేషన్ ల నుండి ప్రత్యేకంగా ఎంఎంటీఎస్ రైళ్లు నడపనున్నట్టు వెల్లడించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.