Site icon NTV Telugu

రేపటి నుంచి రెండో విడత రుణ మాఫీ..!

Harish Rao

Harish Rao

రేపటి నుంచి రెండో విడత రుణ మాఫీ ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నట్టు ప్రకటించారు తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు.. సిద్దిపేటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎందరో మహనీయుల త్యాగాలతో దేశానికి స్వాతంత్ర్యం సాధించుకున్నాం.. మహనీయుల స్ఫూర్తి, మహాత్ముడి అహింసా మార్గం, ప్రజాస్వామ్య పద్ధతిలో మహోద్యమాన్ని నిర్మించి తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసుకున్నాం అన్నారు. ఏ ఆశయ సాఫల్యం కోసం స్వరాష్ట్రాన్ని కోరుకున్నమో ఆ లక్ష్యసాధన దిశగా నాటి ఉద్యమ నాయకుడు, నేటి ముఖ్యమంత్రి నేతృత్వంలో ముందుకు వెళ్తున్నాం అన్నారు.

ఇక, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో తెలంగాణ రాష్ట్రం నేడు దేశానికే తలమానికంగా ఉందన్నారు హరీష్‌రావు… సమైక్య పాలనలో వలసలు, ఆకలి చావులు, రైతు ఆత్మహత్యలకు నెలవుగా ఉన్న తెలంగాణను, స్వ రాష్ట్రంలో ఇవాళ దేశానికే అన్నం పెట్టే.. దేశపు భాండాగారంగా మారిందన్నారు.. రెండో విడతలో 50 వేల రూపాయల లోపు పంట రుణం పొందిన 27,753 మంది అర్హులైన రైతులకు గాను 94.56 కోట్ల రూపాయల రుణమాఫీ చేయనున్నామని.. రేపటి నుంచి రెండో విడత రుణ మాఫీ ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నామని వెల్లడించారు హరీష్‌రావు.. మరోవైపు.. కాళేశ్వరం ప్రాజెక్ట్ తో తెలంగాణ రూపురేఖలే మారనున్నాయన.. ప్రపంచంలోనే అత్యంత వేగంగా నిర్మాణమైన ప్రాజెక్ట్ గా కాళేశ్వరం చరిత్ర సృష్టించిందన్నారు.

Exit mobile version