రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ శీతాకాల విడిది కొరకు ఈ నెల 29 నుండి జనవరి 3 వతేది వరకు హైదరాబాద్ బొల్లారం రాష్ట్రపతి నిలయంలో విడిదికై రానున్నారు.గౌరవరాష్ట్రపతి రాకను పురస్కరించుకొని చేయవలసిన ఏర్పాట్ల గురించి వివిధ శాఖల అధిపతులతో బిఆర్ కెఆర్ భవన్ లో మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ చర్చించారు.
గౌరవ రాష్ట్రపతి హైదరాబాద్ పర్యటనను తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టను, ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్ గుర్తింపును మరింత ఇనుమడింప చేసే అవకాశంగా భావించాలని అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు.తదనుగుణంగా ఎటువంటి లోటుపాట్లు లేకుండా గౌరవ రాష్ట్రపతి పర్యటన సౌకర్యవంతం చేయుటకు అన్ని విభాగాలు సమన్వయంతో వ్యవహరించాలని అధికారులకు స్పష్టం చేశారు.
రాష్ట్రపతి నిలయంలో వెళ్ళే మార్గంలో ట్రాఫిక్ సజావుగా నడిచేందుకు రోడ్డు మరమత్తు, బారికేడింగ్ పనులు చేపట్టాలని జిహెచ్ఎంసి కమీషనర్, కంటోన్మెంట్ బోర్డ్ అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. రాష్ట్రపతి నిలయం వద్ద ప్రొటోకాల్ ప్రకారం విధులు నిర్వహించుటకు వైద్య బృందాలతో పాటు ఇతరశాఖల బృందాలను నియమించాలని తెలిపారు.నిరంతరాయంగా 24 గంటల విద్యుత్ సరఫరా ను నిర్ధారించాలని విద్యుత్ శాఖ ను ఆదేశించారు.