తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడానికి తెరదింపాలని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించేలా కనిపించడంలేదు.. కేంద్రం నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించే పరిస్థితి కనిపించడంలేదు.. ఇవాళ్టి నుంచి గెజిట్ అమల్లోకి రావాల్సి ఉండగా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు పోటాపోటీగా ఆసల్యం చేసేపనిలో పడిపోయాయి..
ప్రాజెక్టుల అప్పగింతపై తెలంగాణ ప్రభుత్వం కమిటీ వేసింది.. దీంతో ఆంధ్రప్రదేశ్ సర్కార్ కూడా పునరాలోచనలో పడిపోయింది. విద్యుత్ కేంద్రాలు, ఆఫ్ టేక్ ప్రాజెక్టులను తెలంగాణ అప్పగిస్తేనే.. ప్రాజెక్టుల అప్పగింత ప్రక్రియ మొదలుపెట్టాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. సీఎం సహా ఉన్నతాధికారులతో మరోసారి చర్చించిన తర్వాతే ప్రాజెక్టుల అప్పగింతపై ముందడుగు వేయనుంది. కేఆర్ఎంబీ పరిధిలోకి ప్రాజెక్టుల అప్పగింతపై మరింత సమయం తీసుకోనుంది తెలంగాణ ప్రభుత్వం. దీనిపై అధ్యయనం కోసం సీఎం కేసీఆర్ ప్రత్యేక కమిటీ వేశారు. ఈఎస్సీ మురళీధర్రావు ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేశారు.. 15 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించిన సీఎం కేసీఆర్.. రిపోర్ట్ వచ్చిన తర్వాతే ప్రాజెక్టుల అప్పగింతపై నిర్ణయం తీసుకోనున్నారు.