ఎన్సిపి నేత శరద్పవార్ నివాసంలో మంగళవారం ప్రతిపక్ష నాయకుల సమావేశం గురించిన కథనాలన్నీ చాలా త్వరగా తేలిపోయాయి. ఏ సమావేశమైనా సరే దాని నిర్వాహకులెవరు, ఉద్దేశమేమిటనేదానిపై ఆధారపడి వుంటుంది. కాని ఈ సమావేశం విషయంలో ప్రతిదీ భిన్న కథనాలతో నడిచింది. శరద్ పవార్ను ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ రెండు సార్లు కలుసుకొని చర్చలు జరపడం దీనికి తొలి సంకేతమైంది. తర్వాత రాష్ట్రీయ మంచ్ నాయకుడుగా బయిలుదేరి ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ ఉపాద్యక్షులుగా వున్న మాజీ బిజెపి కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హా, అప్పటి జెడియు నాయకుడు పవన్కుమార్ల పేరుతో ఆహ్వానాలు వెళ్లాయి. జరిగిన సమావేశానికి మాత్రం శరద్ పవార్ అద్యక్షత వహించారు. ఆయన స్వంత రాష్ట్రమైన మహారాష్ట్రలో ఇప్పుడు ఆయనతో ఎంవిఎ కూటమిలో వున్న శివసేన,కాంగ్రెస్లు కూడా ఈ సమావేశానికి రాలేదు.టిఎంపి ఎన్సిపి ఆర్ఎల్డి నేషనల్ కాన్ఫరెన్స్ ఆమ్ఆద్మీ పార్టీ సిపిఐ సిపిఎం నాయకులు పాల్గొన్నారు.
ఈ సమావేశం ఏదో మూడో కూటమి కోసం కాదని, ప్రజా సమస్యలు దేశంలో రాజకీయ పొందికల గురించి చర్చించడానికి ఇష్టాగోష్టి మాత్రమేనని చర్చల తర్వాత నాయకులు చెప్పారు. మీడియాలో కథనాలు ఏమి వచ్చినా ఈ సమావేశాన్ని ఆ పరిమితుల్లోనే అర్థం చేసుకోవలసి వుంటుంది. సమావేశంలో కాంగ్రెస్ లేకపోవడం కూడా అందరూ గుర్తించిన అంశం కాగా అది యాదృచ్చికమేనని నిర్వాహకులు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.కాంగ్రెస్ బాగా బలహీనపడిపోవడం కూడా ఒక వాస్తవంశరద్ పవార్ దేశంలోనే సీనియర్ ప్రతిపక్ష నాయకుడుగా గుర్తింపు పట్టు వున్నా ఎనభై ఏళ్లు పైబడిన వయస్సు ఆయన పార్టీ పరిమితుల రీత్యా ప్రతిపక్ష కూటమి ప్రధాని అభ్యర్థిగా ముందుకొచ్చే అవకాశం తక్కువని చెప్పాలి.గతంలో ఈ తరహా వేదికల్లో చొరవ తీసుకున్న సిపిఎం స్థానాల సంఖ్య ఇప్పుడు బాగా తగ్గడం ఒకటైతే హడావుడిగా కూటముల గురించి మాట్లాడటం ప్రయోజనం లేదన్న భావం కూడా ఆపార్టీకి వుంది. ఈ దేశంలో ఎన్నికల ఎలాటి ప్రణాళికా బద్దమైన వ్యూహాత్మకమైన ఎజెండాతో జరగకపోయినా ఇన్ని ప్రముఖ పార్టీల నాయకులు ఒక చోట చేరడం తప్పక ప్రాధాన్యత గల విషయంగానే పరిగణించబడుతుంది.ఫలితాల అనంతరమే కూటములు ప్రభుత్వాల ఏర్పాటుచర్చలు ఒక రూపం తీసుకున్నాయని సిపిఎం ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి సోదాహరణంగా చెప్పారు. నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం యునైటెడ్ ఫ్రంట్, యుపిఎ1 ఎన్నికల తర్వాత ఏర్పడినవే.
ఎలాటి ప్రణాళికా బద్దమైన వ్యూహాత్మకమైన ఎజెండాతో జరగకపోయినా ఇన్ని పార్టీల నాయకులు ఒక చోట చేరడం ప్రాధాన్యత గల విషయమే .అయితే ఆదిలోనే హంసపాదులా ఈ సమావేశం తర్వాత ే యుపిలో సమాజ్వాది పార్టీ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్యాదవ్ 2022 ఎన్నికల్లో తమ పార్టీ వంటరిగానే పోటీ చేస్తుందని ప్రకటించారు. బిఎస్పి కాంగ్రెస్లతో గతంలో పొత్తు పెట్టుకున్నా ప్రయోజనం లేకపోయిందని తేల్చి చెప్పారు.చిన్న పార్టీలతో మాత్రం కలుస్తామన్నారు. పవార్నివాసంలోసమావేశం యుపి ఎన్నికల చర్చ కూడా ముఖ్యాంశమని అందరికీ తెలుసు. దేశంలోనే అత్యధిక లోక్సభ స్థానాలువుండటమే గాక బిజెపికి సంఖ్యాబలం సమకూర్చిన ఆ రాష్ట్రంలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని ఓడిరచడం 2024 ఎన్నికలలో ఆ పార్టీని దించడానికి కీలకమవుతుంది. అఖిలేష్ యాదవ్ ప్రకటనను బట్టి ఆ అవకాశం లేదని అర్థమవుతుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్భవ్ ఠాక్రే ఈ మధ్య ప్రధాని మోడీని కలిశాక బిజెపి శివసేన స్నేహం గురించిన కథనాలు మళ్లీ మొదలైనాయి.వైసీపీ టిఆర్ఎస్ బిజెడి వంటి చాలా పార్టీలు ఈ ఆలోచనకు దూరంగా వున్నాయి. కనుక దీనిపై అప్పుడే అనుకూల ప్రతికూల వూహాగానాలు అవసరం లేని పని, అయితే బిజెపి కూడా యుపి ముఖ్యమంత్రి మార్పును అపడంతో సహా అనేక మల్లగుల్లాలు పడటం బట్టి చూస్తే దాని పరిస్థితీ అంతంతమాత్రంగానే వుందనేది స్పష్టమవుతుంది. అందుకే దేశ రాజకీయాల్లో ఇదొక సంధిదశ. ఇలాటి ఇష్టాగోష్టులు ఇంకా అనేకం జరగుతాయి.