భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. న్యాయ వ్యవస్థను పటిష్టం చేసేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి.. ఇప్పటికే ఒకేసారి సుప్రీంకోర్టు జడ్జీలుగా 9 మందిని నియమించి కొత్త రికార్డు సృష్టించారు. ఇప్పుడు దేశంలోని 12 హైకోర్టుల్లో ఏకంగా 68 నియమించేందుకు సిద్ధమయ్యారు.. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం.. ఒకేసారి 68 మంది పేర్లను సిఫారసు చేసింది. ఇది భారత న్యాయ చరిత్రలో తొలిసారి కావడం విశేషం.. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియంలో జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్ సభ్యులుగా ఉన్నారు. దీనిపై పెద్ద కసరత్తే చేసింది కొలీజియం.. మొత్తం 112 మంది పేర్లను పరిగణనలోకి తీసుకుని.. 68 మంది పేర్లను సిఫారసు చేసింది.. ఇందులో 44 మంది బార్కు చెందిన వారుకాగా, 24 మంది జ్యుడిషియల్ సర్వీసుకు చెందినవారిగా తెలుస్తోంది.
ఇక, సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసిన జాబితాలో 10 మంది మహిళలు కూడా ఉన్నారు. న్యాయమూర్తుల కొరతతో దేశంలోని వివిధ హైకోర్టుల్లో కేసులు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కొలీజియం జడ్జిల భర్తీ ప్రక్రియను వేగవంతం చేసింది. అలహబాద్ హైకోర్టుకు 13 మంది లాయర్లను న్యాయమూర్తులుగా సిఫార్సు చేసింది.. అలహబాద్ హైకోర్టులో ప్రస్తుతం 92 మంది న్యాయమూర్తులు ఉన్నారు.. అలహబాద్ హైకోర్టుకు మంజూరైన
న్యాయమూర్తుల సంఖ్య 160 కాగా.. భర్తీ చేయాల్సిన న్యాయమూర్తుల సంఖ్య 68గా ఉంది.. ఇక, కేరళ హైకోర్టుకు 8 మంది న్యాయమూర్తులను నియామకం చేస్తూ సుప్రీంకోర్టు కొల్లీజియం సిఫార్సు చేసింది.. అందులో నలుగురు లాయర్లు. మరో నలుగురు న్యాయాధికారులు ఉన్నారు. జార్ఖండ్ హైకోర్టుకు ఐదుగురు జ్యుడిషియల్ అధికారులను న్యాయమూర్తులుగా సిఫార్సు చేసింది కొలీజియం.. మధ్యప్రదేశ్ హైకోర్టుకు 1 లాయర్ ను న్యాయమూర్తిగా నియామకం చేస్తూ సిఫార్సులు ఇచ్చింది.. పంజాబ్ హైకోర్టుకు నలుగురు లాయర్లను న్యాయమూర్తులుగా నియామకానికి సిఫార్సు చేయగా.. రాజస్థాన్ హైకోర్టుకు ముగ్గురు లాయర్లను, మరో ముగ్గురు జ్యుడిషియల్ అధికారులు కలిపి మొత్తం ఆరుగురు న్యాయమూర్తులను సిఫార్సు చేసింది. గౌహతి హైకోర్టు కు ముగ్గురు లాయర్లను, మరో ఇద్దరు జ్యుడిషియల్ అధికారులను కలిపి ఐదుగురిని న్యాయమూర్తులుగా నియామకం చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఇక, బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దామా శేషాద్రి నాయుడు రాజీనామాను ధృవీకరిస్తూ కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఛత్తీస్ఘడ్ హైకోర్టుకు ఒక లాయర్ ను, ఒక జ్యుడిషియల్ అధికారిని మొత్తం ఇద్దరిని న్యాయమూర్తులుగా నియామకానికి సిఫార్సు చేయగా.. జమ్మూ కాశ్మీర్ హైకోర్టుకు ఇద్దరు జ్యుడిషియల్ అధికారులను మరో ఇద్దరు లాయర్లు.. మొత్తం నలుగురిని న్యాయమూర్తులుగా నియామకం చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.