NTV Telugu Site icon

ఒమిక్రాన్‌ టెన్షన్‌.. ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యేక నిఘా..

సౌతాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ఇప్పుడు ప్రపంచ దేశాలను టెన్షన్‌ పెడుతోంది.. ఇప్పటికే అప్రమత్తమైన చాలా దేశాలు కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి.. ముఖ్యంగా విదేశాల నుంచి రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నారు.. ఇక, భారత్‌ కూడా విదేశాల నుంచి వచ్చే టూరిస్టులు, ప్రయాణికులపై ప్రత్యేకంగా దృష్టిసారించింది.. ముఖ్యంగా 11 హై రిస్క్‌ దేశాల నుంచి వస్తున్న వారికి పరీక్షలు తప్పనిసరి చేసింది.. కొత్త వేరియంట్‌తో అలెర్ట్‌ అయిన తెలంగాణ సర్కార్‌.. శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో హై రిస్క్‌ దేశాల నుంచి వస్తున్న ప్రయాణికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.. పలు దేశాల్లో ఒమిక్రాన్‌ ద్వా రా ఇన్‌ఫెక్షన్‌ కేసులు పెరగడంతో కేంద్రం ఇటీవల విడుదల చేసిన కొత్త మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు.

Read Also: ప్రేయసి పెళ్లి.. దండలు మార్చుకుంటుంటే మధ్యలో దూరిన మాజీ లవర్..!

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు విదేశీ ప్రయాణికుల తాకిడి నిత్యం ఉంటుంది.. దీంతో. అ్రమత్తమైన అధికారులు.. ఇంటర్నేషనల్‌ అరైవల్‌ హాల్‌ వద్ద ప్రీ-ఇమ్మిగ్రేషన్‌లో ప్రత్యేక కొవిడ్‌-19 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. తప్పనిసరిగా థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసుకోవాలన్నారు. టెర్మినల్‌ అంతటా స్టిక్కర్లు, పోస్టర్ల ద్వారా ఆర్టీ-పీసీఆర్‌/ర్యాపిడ్‌ పీసీఆర్‌ కోసం సూచికలను కూడా ఏర్పాటు చేశారు అధికారులు.. మరోవైపు.. టెస్ట్‌ల కోసం ముందస్తు బుకింగ్‌ ప్రకియకు కూడా శ్రీకారం చుట్టారు.. www.hyderabad.aero లింకు ద్వారా లేదా ల్యాబ్‌ వెబ్‌సైట్‌ http://covid.mapmygenome.in ద్వారా బుకింగ్‌ చేసుకుని వీలుకల్పించారు.. ఇక, ఆర్టీ-పీసీఆర్‌కు రూ.750గా నిర్ణయించారు.. ఈ టెస్ట్‌ రిపోర్ట్‌ కోసం 6 గంటల వెయిట్‌ చేయాల్సి ఉంటుంది.. ర్యాపిడ్‌ పీసీఆర్‌కు రూ.3,900గా నిర్ణయించారు.. దీని కోసం 2గంటల సమయం వేచి ఉండాలి. మరోవైపు, అంతర్జాతీయ ప్రయాణికుల కోసం సీటింగ్‌, ఫుడ్‌ అండ్‌ బేవరేజెస్‌, ఫారిన్‌ ఎక్సేంజ్‌, పేమెంట్‌ కౌంటర్లతో ప్రత్యేక వెయిటింగ్‌ ఏరియాను కేటాయించారు ఎయిర్‌పోర్ట్‌ నిర్వాహకులు. కాగా, డిసెంబర్‌ 5వ తేదీ నాటికి మొత్తం 1,443 మంది ప్రయాణికులు హైదరాబాద్‌కు చేరుకోగా.. అందులో 13 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే.. గచ్చిబౌలి టిమ్స్‌కు తరలించి వారికి చికిత్స అందిస్తున్నారు.. వారి శాంపిల్స్‌ పంపించి టెస్టులు చేయగా ఒమిక్రాన్‌ నెగిటివ్‌గా వచ్చిన సంగతి తెలిసిందే.