కరోనా మహమ్మారి టెన్షన్ నుంచి ప్రపంచదేశాలు ఇప్పట్లో బయటపడేలా కనిపించడంలేదు పరిస్థితి.. సౌతాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. జెట్ స్పీడ్తో ప్రపంచదేశాలను చుట్టేస్తోంది.. గత నెల 24వ తేదీన ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బయటపడగా… కేవలం తొమ్మిది రోజుల్లోనే 30 దేశాలకు వ్యాప్తి చెందింది.. అందులో భారత్ కూడా ఉండడం మరింత కలవరపెట్టే విషయం.. ఇక, ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 375 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. సౌతాఫ్రికాలో అత్యధికంగా 183 కేసులు ఉన్నాయి.. అయితే, డెల్టా వేరియంట్ కంటే ఐదు రెట్ల వేగంతో ఈ వేరియెంట్ వ్యాప్తి చెందుతున్నట్టు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.. ఈ వేరియంట్ బారినపడినవారిలో ఇప్పటి వరకు అధికంగా యువతే ఉన్నట్టు తేల్చారు అధికారులు.. సౌతాఫ్రికాలో యువతకే అత్యధికంగా ఈ వేరియెంట్ సోకుతూ ఉందని, వారిలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండడం వల్ల ప్రస్తుతానికి స్వల్ప లక్షణాలే కనిపిస్తున్నాయని ఆ దేశ శాస్త్రవేత్తలు చెబుతున్నమాట.
Read Also: కొత్త టెన్షన్..! ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఎస్కేప్..!
ఇక, ఒమిక్రాన్ నివారణ చర్యలు చేపట్టిన ఆయా దేశాలు.. కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి.. లాక్డౌన్, మార్కెట్లు మూసేయడం కంటే వ్యాక్సినేషన్, మాస్కులు సహా కోవిడ్–19 నిబంధనలు పాటించడం ద్వారా ఈ మహమ్మారిని ఎదుర్కోవడమే బెటరనే అభిప్రాయపడుతున్నాయి ఆయా దేశాలు.. వ్యాక్సిన్ తీసుకోని వారి కదలికలను జర్మనీ పరిమితం చేసింది. నిత్యావసరాల దుకాణాలకు తప్పితే అలాంటి వారిని మరే ఇతర స్టోర్లు, మాల్స్, పబ్బులు, క్లబ్బులు, సాంస్కృతిక కార్యక్రమాలకు అనుమతించబోమని జర్మనీ చాన్స్లర్ ఏంజెలా మెర్కెల్ ఇప్పటికే స్పష్టం చేశారు. మరోవైపు, 60 ఏళ్లకు పైబడిన వారు టీకా తీసుకోవడానికి నిరాకరిస్తే వారి నెలవారీ పెన్షన్ నాలుగో వంతు కోత వేసే యోచనలో ఉంది గ్రీస్ ప్రభుత్వం. ఇక, 60 ఏళ్లు పైబడిన వారు వ్యాక్సినేషన్ పూర్తిచేసుకుంటే 500 యూరోలు బోనస్గా ఇవ్వాలని ప్రతిపాదిస్తోంది స్లోవేకియా.. అప్పటికే రెండు డోసులు పూర్తిచేసుకున్నవారికి అమెరికా బూస్టర్ డోసుల్ని కూడా ఇస్తోంది. మరోవైపు.. విదేశాల నుంచి వచ్చేవారికి భారత్ కరోనా నిర్ధారణ పరీక్షలు తప్పనిసరి చేసింది.. రాష్ట్రాలు కూడా అప్రమత్తం అవుతున్నాయి.. మళ్లీ మాస్క్ మస్ట్ అంటూ అధికారులు.. మాస్క్ ధరించకపోతే రూ. వెయ్యి ఫైన్ అంటూ ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.