NTV Telugu Site icon

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ఎన్జీటీ బ్రేక్‌..!

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రాజెక్టుల్లో ఒకటైన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ) బ్రేక్‌ వేసింది.. ప్రాజెక్టు పనులు నిలిపి వేయాలని ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది… పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు పనులు చేపట్టవద్దని స్పష్టం చేసింది.. కాగా, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలంలోని కరివెన వద్ద నిర్మిస్తున్నారు. దీనికి 2015, జూన్ 11న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. జూరాల ప్రాజెక్టు వద్ద కృష్ణానది నుంచి 70 టీఎంసీల వరద నీటిని ఎత్తిపోయడం ఈ ప్రాజెక్టు లక్ష్యంగా ఉంది… ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 7 లక్షల ఎకరాలకు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 2.7 లక్షల ఎకరాలకు, నల్లగొండ జిల్లాలో 0.3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే ప్రభుత్వ ప్రణాళికగా ఉంది.

Read Also: ‘ధరణి’కి ఏడాది.. సమస్యలు ఏమీ లేవా..?

ఇక, హైదరాబాద్‌ సిటీకి తాగునీరు, పారిశ్రామిక అవసరాల కోసం, నాగర్‌కర్నూలు, మహబూబ్‌నగర్, వికారాబాద్‌, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో తాగునీరు, సాగునీరు అందించే లక్ష్యాలతో ఈ ప్రాజెక్టును చేపట్టింది సర్కార్.. అయితే, పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుపై ఏపీ అభ్యంతరం చెబుతూ వస్తోంది.. దీనిపై తన అభ్యంతరాలను కేంద్ర ప్రభుత్వం సహా అన్ని వేదికలకు తెలియజేసింది.. దీనిపై విచారణ జరిపిన జాతీయ గ్రీన్‌ ట్రిబ్యునల్‌.. ప్రాజెక్టు పనులు నిలిపివేయాలని ఆదేశించింది.. కేంద్ర అటవీశాఖ అనుమతులు తప్పనిసరి అని స్పష్టం చేసింది.. దీంతో.. తెలంగాణ ప్రభుత్వానికి ఎన్జీటీలో ఎదురుదెబ్బ తగినట్టు అయ్యింది.