సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ‘రిపబ్లిక్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు, సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు.
సినిమా టికెట్ ఆన్లైన్ సేల్ పై పవన్ మండిపడ్డారు. ఈ క్రమములోనే వైసీపీ మద్దతుదారుడైన మోహన్ బాబుకి పవన్ చురకలు అంటించారు. ‘సినిమా టికెట్ ఆన్లైన్ విక్రయాలకు ఒకే చెప్తే.. మీ విద్యానికేతన్ లో సీట్లు కూడా.. ప్రభుత్వమే ఆన్లైన్ లో భర్తీ చేస్తుంది’ అని మీకు ఒకేనా అంటూ పవన్ ప్రశ్నించారు. సినీ పరిశ్రమపై కన్నెత్తి చూస్తే ఊరుకునేది లేదని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వకీల్ సాబ్ సినిమా లేకుంటే.. ఏపీలో సినిమాలు రిలీజ్ అయ్యుండేవి. ప్రైవేట్ పెట్టుబడితో మేము సినిమాలు చేస్తుంటే, ప్రభుత్వం కంట్రోల్ చేయడమేంటి? అని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.
అయితే ఈ వ్యాఖ్యలపై తాజాగా మోహన్ బాబు స్పందించారు. ‘నా చిరకాల మిత్రుని సోదరుడైన పవన్ కళ్యాణ్ నువ్వు నాకంటే చిన్నవాడివి అందుకని ఏకవచనంతో సంబోధించాను. వవన్ కళ్యాణ్ గారు అనడంలో కూడా తప్పేమిలేదు. చాలా కాలానికి నన్ను మెల్లగా లాగావ్, సంతోషమే.. ఇప్పుడు మా ఎలక్షన్స్ జరుగుతున్నాయి. నా కుమారుడు విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా నిలబడ్డాడు అన్న సంగతి నీకు తెలిసిందే. అక్టోబర్ 10వ తేదీన ఎలక్షన్స్ అయిపోతాయి. ఆ తర్వాత నువ్వు అడిగిన ప్రతిమాటకి నేను హృదయపూర్వకంగా సమాధానం చెబుతాను. ఈలోగా నువ్వు చేయవలసిన ముఖ్యమైన పని.. నీ అమూల్యమైన ఓటుని నీ సోదర సమానుడైన విష్ణుబాబుకి, అతని ప్యానల్ కి వేసి వాళ్ళని గెలిపించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్యూ వెరీమచ్..’ అంటూ మోహన్ బాబు చురకలు అంటించారు.