ప్రేమించుకున్నారు. పెళ్ళిచేసుకోవాలని భావించారు. అయితే ఆ ఇద్దరిని తల్లిదండ్రులు విడదీశారు. ఇద్దరికీ వేర్వేరు వ్యక్తులతో ఎంగేజ్మెంట్ చేశారు. కానీ వారి మధ్య ప్రేమ మరింత బలపడింది. పెళ్ళిచేసుకోవడానికి వీలు లేకపోవడంతో ఆత్మహత్యాయత్నం చేశారు. సకాలంలో వారిని రక్షించడంతో ప్రాణాపాయం తప్పింది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో ప్రేమ జంట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. కేసముద్రం మండలం కాట్రపల్లికి చెందిన ఓ ప్రేమ జంట గత మూడేళ్ళుగా ప్రేమించుకుంటున్నారు.
కాట్రపల్లి గ్రామానికి చెందిన గూగులోతు గణేష్, జాటోత్ లావణ్య ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరికీ ఇష్టం లేకుండా గతంలో వేర్వేరు వ్యక్తులతో ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. ఎంగేజ్మెంట్ ఇష్టంలేని వారిద్దరు రాజన్ పల్లి అడవికి వచ్చారు. వస్తూ వస్తూ పురుగుల మందు తెచ్చుకుని అక్కడే తాగేశారు. ఇది గమనించిన స్థానికులు వారి బంధువులకు సమాచారం అందించగా గూడూరు ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం ఆ ఇద్దరినీ మహబూబాబాద్ ఆస్పత్రికి తరలించారు. వారిద్దరికీ ప్రాణాపాయం తప్పిందని బంధువులు తెలిపారు.