తెలంగాణలో స్థానిక సంస్థల స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో కరీంనగర్ మేయర్ సునీల్ రావు బీజేపీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన కరీంనగర్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని రెండు ప్రధాన పక్షాలు అభ్యర్థులను నిలబెట్టడం లేదని చెప్పడం జరిగిందని, టీఆర్ఎస్ అభ్యర్థులు గా భాను ప్రసాద్, ఎల్ రమణ లు ఉన్నారని తెలిపారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నా ఈటల రాజేందర్ నా అర్థం కావట్లేదని ఆయన ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ స్థానంలో పోటీ చేయట్లేదని బండి సంజయ్ అంటే ఈటల రాజేందర్ పోటీలో పెట్టామని అంటున్నారని, బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్నాయన్నారు. ఈటల రాజేందర్ పెట్టిన అభ్యర్థి కాంగ్రెస్ వాళ్ళను కలుస్తున్నాడని, దమ్ముంటే పార్టీ ద్వారా కొట్లాడాలని సవాల్ విసిరారు. అంతేకాకుండా ఎంపీ ఓ స్టేట్ మెంట్ ఎమ్మెల్యే ఓ స్టేట్ మెంట్ ఇస్తున్నారన్నారు.
బండి సంజయ్ కు చెక్కు పెట్టాలని ఈటల చూస్తున్నాడన్నారు. హుజురాబాద్ లో ఇలానే కుమ్మక్కు రాజకీయాలు చేసి కాంగ్రెస్ పార్టీ ని అమ్ముకున్నరని, ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ను అమ్ముకుంటున్నారని ఆరోపించారు. బండి సంజయ్ కు తెలియకుండా బీజేపీ కార్పొరేటర్లు ఈటల పెట్టిన అభ్యర్థికి సపోర్ట్ చేస్తున్నారని, టీఆర్ఎస్ బలంగా ఉందని కుట్ర రాజకీయాలు చేస్తున్నారన్నారు.
బీజేపీ అధ్యక్షుడు కూడా మారే ఆవకాశం ఉందని తెలుస్తోందని, టీఆర్ఎస్ పతనం ప్రారంభం అయిందని రవీందర్ సింగ్ అన్నాడని కానీ పతనం అయింది రవిందర్ సింగ్ నేనని ఆయన అన్నారు. మేయర్ గా ఉండి 50 మంది కార్పొరేటర్లకే హెల్త్ కార్డులు ఇవ్వలేదని ఇక ఎంపీటీసీలకు ఇస్తావా.? అంటూ ప్రశ్నించారు.