వచ్చే ఏడాది జనవరి 1 నుంచి రూ.వెయ్యి లోపు ఉండే రెడీమేడ్ వస్త్రాల ధరలు పెరగనున్నాయి. ఎందుకంటే గార్మెంట్స్పై ఇప్పటివరకు అమలు చేస్తున్న ఐదు శాతం జీఎస్టీ జనవరి నుంచి 12 శాతానికి పెరగనుంది. దీంతో వస్త్రాల ధరలు కూడా పెరుగుతాయి. సాధారణంగా గార్మెంట్స్ ఇండస్ట్రీలో 85 శాతం రూ.వెయ్యి లోపు విలువ ఉండేవే ఉంటాయి. ఈ నెల 18న రూ.వెయ్యి విలువ గల గార్మెంట్స్ మీద జీఎస్టీ శ్లాబ్ను 12 శాతానికి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
Read Also: వైరల్ వీడియో… చంద్రబాబు ఏడ్చాడని తానూ ఏడ్చిన చిన్నారి
ఈ మేరకు రూ.వెయ్యి విలువ లోపు గార్మెంట్స్ మీద కూడా 12 శాతం జీఎస్టీని కేంద్రం వసూలు చేస్తుందని ఐసీసీ టెక్స్టైల్ కమిటీ ఛైర్మన్ సంజయ్ కే జైన్ తెలిపారు. పేదవారు కూడా ఇక నుంచి తమ దుస్తులపై 7 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇది ద్రవ్యోల్బణానికి దారి తీస్తుందన్నారు. ఇప్పటికే నూలు ధర 25 శాతం పెరిగిందని….ఇప్పుడు జీఎస్టీ కూడా పెంచడంతో నూలుపై వచ్చే ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ తమకు సాయపడదని సంజయ్ కే జైన్ వెల్లడించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏటా గార్మెంట్ ఇండస్ట్రీ టర్నోవర్ రూ.10 లక్షల కోట్లు ఉంటే, జీఎస్టీ భారం రూ.8.5 లక్షల కోట్లపై పడుతుందని ఆయన తెలిపారు.