మనషులు, జంతువుల మధ్య బంధం గురించి స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఈ అనుబంధం చాలా గొప్పది, విడదీయలేనిది. ఆ మూగ జీవాలు చూపించే ప్రేమ అమూల్యం. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. చనిపోయిన తన మావటిని కడసారి చూసేందుకు గజరాజు తరలివచ్చిన దృశ్యాలను ఆ వీడియోలో చూడొచ్చు. విగతజీవుడిలా పడివున్న ఆ మావటిని పిలుస్తున్నట్టుగా తొండం పైకెత్తి పలుమార్లు ఆ ఏనుగు ప్రదర్శించిన హావభావాలు ప్రతి ఒక్కరినీ కదిలిస్తున్నాయి.ఆ మావటి కుటుంబ సభ్యుడు ఏనుగును చూసి కన్నీటిపర్యంత మయ్యాడంటే ఆ కుటుంబానికి, ఏనుగుకు మధ్య ఎంత ఆత్మీయత ఉందో అర్థమవుతుంది. ఈ ఘటన కేరళలోని కొట్టాయంలో చోటుచేసుకుంది. ఆ మావటి పేరు కున్నక్కడ్ దామోదరన్ నాయర్. 74 ఏళ్ల నాయర్ ను స్థానికులు ఓమన్ చెట్టన్ అని పిలుస్తుంటారు. ఆయన గత 6 దశాబ్దాలుగా ఏనుగుల సంరక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.కాగా ఏనుగు పేరు పాల్ఘాట్ బ్రహ్మదత్తన్. ఓమన్ చెట్టన్ కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతూ కన్నుమూశాడు.