భారత్తో టెస్టు సిరీస్లో తలెత్తిన వివాదంపై ICC తలుపు తట్టింది… ఇంగ్లాండ్ వేల్స్ క్రికెట్ బోర్డు. ఈ విషయంలో తమకు సాయం చేయాలని ECB కోరింది. మ్యాచ్ రద్దవడం వల్ల నష్టపోతామంటున్న ECB, ఆ నష్టాన్ని ఎలాగైనా పూడ్చుకోవాలని చూస్తోంది. మరోవైపు టెస్ట్ రద్దుపై స్పందించిన రవిశాస్త్రి… తన వల్లే కరోనా వ్యాప్తి జరిగిందంటే ఒప్పుకోనన్నాడు.
భారత్-ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్లో ఐదవ మ్యాచ్ రద్దు వ్యవహారంపై ICCకి చేరింది. ఈ మ్యాచ్ భవితవ్యం సిరీస్ ఫలితంపై ఆధారపడడంతో ఐసీసీకి లేఖ రాసింది ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు. ఇరు బోర్డుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఐసీసీ డిస్ప్యూట్ రిసొల్యూషన్ కమిటీ -DRCకి లేఖ రాసింది.
కరోనా కేసుల వల్ల ఈ మ్యాచ్ రద్దయిందని ప్రకటిస్తే… తమకు 40 మిలియన్ పౌండ్ల నష్టం జరుగుతుందంటోంది ECB. ఇలాంటి పరిస్థితుల్లో సరైన పరిష్కారం చూపితే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే వీలుంటుందని భావిస్తోంది. ఈ కారణంగానే సాయం చేయాల్సిందిగా ICCని కోరింది ECB.
ఐదో టెస్టుకు ముందు భారత బృందంలో ఒక సహాయక సిబ్బందికి కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో సీనియర్ ఆటగాళ్లు మ్యాచ్ ఆడేందుకు నిరాకరించారు. దీనిపై ఇరు బోర్డులు చర్చించి… మ్యాచ్ను రద్దు చేశాయి. అయితే, దీని ఫలితం… సిరీస్పై ఆధారపడడంతో పాటు ఇరు బోర్డులకు సమస్యగా మారింది. పైగా ఇది ఆర్థికంగానూ తమకు నష్టం జరుగుతుందంటోంది ECB. అయితే, రద్దయిన ఐదో టెస్టును భవిష్యత్లో తిరిగి నిర్వహించేందుకు గల అవకాశాలను పరిశీలిస్తోంది బీసీసీఐ. దీని కోసం త్వరలోనే ఇంగ్లాండ్కు వెళ్తున్నారు BCCI అధ్యక్షుడు సౌరభ్గంగూలీ.
ECB లేఖతో ICC ముందు ఇప్పుడు 2 ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఒక వేళ ఐదో టెస్టును గనుక ఐసీసీ పూర్తిగా రద్దు చేస్తే టీమిండియా 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంటుంది. అప్పుడు దీన్ని నాలుగు టెస్టుల సిరీస్గానే పరిగణిస్తారు. టీమిండియానే ఈ మ్యాచ్లో ఆడటానికి విముఖత చూపడం వల్ల ఇంగ్లాండ్కు అనుకూలంగా నిర్ణయం తీసుకోవచ్చు. చివరి టెస్టులో ఆడటానికి ఆ జట్టు సిద్ధంగా ఉన్నా భారత్ ఒప్పుకోని పక్షంలో ఫలితాన్ని ఇంగ్లాండ్కే కేటాయిస్తారు. దీంతో 2-2తో సిరీస్ సమానంగా మారుతుంది. అప్పుడు ఇంగ్లాండ్ బోర్డు ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ చేసుకునే వీలుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఐసీసీ ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
మరోవైపు… జట్టు బసచేసిన హోటల్లో తన పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించి కరోనా బారిన పడిన టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి… విమర్శకులపై ఎదురుదాడికి దిగాడు. యూకే మొత్తం బార్లా తెరిచేశారని… తన వల్లే భారత బృందానికి కరోనా వ్యాపించిందంటే ఒప్పుకోనని అన్నాడు. ఆంక్షలు పూర్తిగా సడలించి ప్రజలంతా స్వేచ్ఛగా తిరిగేటప్పుడు… జరిగేది ఏదైనా ఉంటే తొలి టెస్ట్ నుంచే జరిగి ఉండేదని… తన వైఖరిని సమర్థించుకున్నాడు. టీమిండియాను ఆకాశానికెత్తిన రవిశాస్త్రి… ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ కూడా భారత జట్టులా ఆడలేదని అన్నాడు. కరోనా విపత్కర పరిస్థితుల్లో కోహ్లీ సేన ఇంగ్లండ్పై దాదాపు గెలిచినంత పని చేసిందని… గతంలో ఆస్ట్రేలియాపైనా భారత జట్టు అద్భుతంగా రాణించిందని కొనియాడారు.