ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి వైయస్ జగన్ లేఖ రాశారు. ప్రైవేటు ఆస్పత్రులు నేరుగా వాక్సిన్లు కొనుగోలు చేయడానికి ఇచ్చిన అనుమతిపై పునరాలోచించాలని ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి జగన్ విజ్ఞప్తి చేశారు. అలాగే కోవిడ్–19ను ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వానికి మీరు అందిస్తున్న సహాయ సహకారాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు సిఎం జగన్. ఏపీలో 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉన్న వారందరికీ ఉచితంగా టీకాలు వేయాలని నిర్ణయించామని…అయితే తగిన సంఖ్యలో టీకాలు అందుబాటులో లేకపోవడం వల్ల తొలుత 45 ఏళ్లు దాటిన వారందరికీ రెండు డోస్ల టీకాలు పూర్తి చేసే ప్రక్రియలో ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. మరోవైపు ప్రైవేటు ఆస్పత్రులు ఉత్పత్తిదారుల నుంచి నేరుగా కోవిడ్ వ్యాక్సిన్లు కొనుగోలు చేయవచ్చన్న కేంద్ర నిర్ణయం ప్రజల్లో తప్పుడు సంకేతాలను తీసుకువెళ్తోందన్నారు. వాక్సిన్ల ధరల్లో తేడాలు, ఏ రేటుకు వాక్సిన్ వేయాలన్న దానిపై ఆయా ఆస్పత్రులకు వెసలుబాటు ఉండడంతో, కొన్ని ఆస్పత్రులు ఒక్కో డోస్కు రూ.2 వేల నుంచి రూ.25 వేల వరకు వసూలు చేస్తున్నాయని తెలిపారు. ఇది ప్రజలపై భారం వేయడమే కాకుండా, వారి విమర్శలకు దారి తీస్తోందని.. నిజానికి కోవిడ్ వాక్సిన్లు ప్రజలకు ఉచితంగా అందించాల్సి ఉంది… అలా వీలు కాకపోతే నామమాత్ర ధరలో టీకా వేయాలని పేర్కొన్నారు.
45 ఏళ్లు దాటిన వారికే రెండు డోస్ల వాక్సిన్ వేయడానికి సరిపడా సరఫరా ఇప్పుడు లేదని…ఇలాంటి పరిస్థితుల్లో 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారికి టీకాలు వేయడం వచ్చే కొన్ని నెలల్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదన్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేటు ఆస్పత్రులు నేరుగా కోవిడ్ వాక్సిన్లు కొనుగోలు చేసేందుకు అనుమతి ఇవ్వడం సరి కాదని…వాక్సిన్లు సేకరించే ప్రైవేటు ఆస్పత్రులు ఇష్టానుసారం ధరలకు టీకాలు వేసే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ నిర్ణయంపై పునరాలోచించాలని లేఖలో ప్రధాని మోడీని సిఎం జగన్ కోరారు. దేశంలో ఉత్పత్తి అవుతున్న కోవిడ్ వాక్సిన్ డోస్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రమే అందుబాటులో ఉండాలని… అప్పుడే ప్రజలందరికీ ఏ ఇబ్బంది లేకుండా వాక్సిన్ డోస్లు వేసే వీలు కలుగుతుందన్నారు. ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుని, ప్రస్తుత పరిస్థితుల్లో వాక్సిన్ బ్లాక్మార్కెట్కు తరలిపోకుండా నిరోధిస్తారని ఆశిస్తున్నానని సిఎం జగన్ లేఖలో పేర్కొన్నారు.