ఉత్తరాంధ్ర, ఒడిషాల వైపు జవాద్ తీవ్ర తుఫాన్ ముప్పు ముంచుకు వస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ రోజు అర్ధరాత్రి వాయుగుండం ఏర్పడనుంది. ఆ తర్వాత 24గంటల్లో తుఫాన్ గాను అనంతరం తీవ్ర తుఫాన్ గాను మారుతుంది. ఇప్పటికి ఉన్న అంచనా ప్రకారం ఈ తుఫాన్ ఉత్తరాంధ్ర తీరం వెంబడి బలమైన గాలులతో ప్రయాణిస్తుంది. దీని ప్రభావం వల్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఈ నేపథ్యంలో విశాఖపట్నంలోని పర్యాటక ప్రదేశాలు 3రోజుల పాటు మూసివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా తుఫాన్ తీవ్రత తగ్గే వరకు సందర్శకులు రావద్దని సూచించారు. ఈ నేపథ్యంలో విశాఖలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల సెలవులను కూడా రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. గ్రామస్థాయి నుంచి జిల్లా అధికారి వరకు విధులకు హజరుకావాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కలెక్టరేట్, జీవీఎంసీ, సబ్ కలెక్టర్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు.