ఎమ్మెల్యే రాజాసింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. బీజేపీ నేతగా, గోషామహల్ నుంచి తెలంగాణ అసెంబ్లీకి తొలుత ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యేగా ఆయనకు పేరుంది. వివాదాలు కూడా తక్కువేం కాదు. హిందూత్వానికి ఆయన బ్రాండ్ అంబాసిడర్. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైల మల్లిఖార్జున స్వామి దర్శనానికి వచ్చారు. ఈసందర్భంగా రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
శ్రీశైల దేవస్థానం మర్యాదను కాపాడటంలో సియం జగన్ విఫలం అయ్యారన్నారు. హిందూ దేవాలయాల పరిధిలో అన్యమతస్తులు వ్యాపారాలు చేయకూడదని వైఎస్సార్ హయాంలో 426 జీవో తీసుకొచ్చారు. జగన్ పాలనలో 426 జీవోను పక్కన బెట్టి ఇతర మతస్తులు వ్యాపారాలు చేస్తున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ హిందువులు హైకోర్టుకు వెళితే.. వేరే మతస్తులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. హిందువుల తరపున ప్రభుత్వం ఎందుకు అడ్వకేట్ ను నియమించలేదు.
సుప్రీంకోర్టు తాత్కాళిక ఆర్డర్ తో ముస్లింలు యథావిధిగా వ్యాపారాలు చేసుకుంటున్నారు. శ్రీశైల దేవస్థానంలో ఇతర మతస్థులు ఉండేలా ప్రభుత్వం కుట్రలు పన్నుతోంది. జగన్ సీఎం అయ్యాక ఏపీలో హిందువులకు, ఆలయాలకు రక్షణ లేకుండా పోయింది. హిందూ ఆలయాల్లో ఇతర మతస్థులు వ్యాపారాలు చేయకూడదు. ఈ పద్ధతి పాటించకపోతే రాబోయే రోజుల్లో మత కలహాలు రేగే అవకాశం ఉంది. అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరించారు.