కమల్ హాసన్ సొంత పార్టీ మక్కల్ నీది మయ్యమ్ కు ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 2.52 శాతం ఓట్లు మాత్రమే లభించాయి. గత యేడాది కమల్ హాసన్ తన పుట్టిన రోజు సందర్భంగా ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రిని తానేనంటూ నర్మగర్భంగా సెలవిచ్చారు. ఇప్పుడు దానిని గుర్తు చేసి కొందరు ఆట పట్టిస్తుంటే, మరోపక్క కమల్ ను నమ్ముకుని పార్టీలోకి అడుగుపెట్టిన చాలామంది బ్యూరోక్రాట్స్ రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారు. ఐపీఎస్ అధికారి మౌర్యతో పాటు, ఐఏఎస్ అధికారి సంతోష్ బాబు, పద్మప్రియ, సి.కె. కుమరవేలు, శేఖర్, సురేశ్ అయ్యర్ తదితరులు పార్టీని వీడి వెళ్ళిపోయారు. మరీ చిత్రం ఏమంటే పార్టీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ మహేంద్రన్ రాజీనామా ఎవ్వరూ ఊహించనిది! కమల్ ను ఒంటరిని చేసి అంతా వెళ్లిపోతుంటే… కేవలం నటి, బిగ్ బాస్ ఫేమ్ సనమ్ శెట్టి మాత్రం ఆయనకు బాసటగా నిలిచి, వీరందరినీ కడిగిపారేస్తోంది. కమల్ హాసన్ పార్టీ ఒకవేళ ఎన్నికల్లో గెలిచి ఉంటే మీరు ఇలానే ప్రవర్తించేవారా? అని అడుగుతోంది. వ్యక్తిగత కారణం
అనే ఒకే ఒక్క పదాన్ని ఉదహరించి పార్టీకి రాజీనామా చేసిన వారందరినీ మీకు అసలు కృతజ్ఞత అనేది ఉందా?
అని ప్రశ్నిస్తోంది. పార్టీని, కమల్ హాసన్ ను మాత్రమే కాకుండా వీరంతా ఓటు వేసిన ప్రజలనూ మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేసింది సనమ్ శెట్టి. తమ పార్టీకి ఎందుకు ఓటు వేయాలో ప్రచార సమయంలో చెప్పిన ఈ నేతలంతా… ఇవాళ తామెందుకు పార్టీకి రాజీనామా చేశారో కూడా చెప్పాల్సిన అవసరం ఉందని సనమ్ కోరుతోంది. కమల్ పార్టీకి సనమ్ శెట్టి గత ఎన్నికల్లో ప్రచారం చేయలేదు. కనీసం ఆ పార్టీలో కూడా చేరలేదు. కానీ ఇవాళ కమల్ హాసన్ కు మద్దత్తుగా అమ్మడు గళం విప్పడం వెనుక కనిపించని అదృశ్య శక్తులు ఏవో ఉండి ఉంటాయని కొందరు అనుమానిస్తున్నారు.