పదో తరగతి పరీక్షలు ఫలితాల వెల్లడికి ఫార్ములా రూపకల్పన కోసం నియమించిన హైపవర్ కమిటీ సిఫార్సులను ఆమోదించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. కోవిడ్ కారణంగా పరీక్షలు రద్దు కావటంతో ఫలితాలను వెల్లడికి అనువైన విధానంపై నివేదిక ఇచ్చింది హైపవర్ కమిటీ. 2020, 2021 పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాల వెల్లడికి హైపవర్ కమిటీ రూపొందించిన ఫార్ములాను ప్రభుత్వం ఆమోదించింది.. 2019-2020 విద్యా సంవత్సరానికి గ్రేడ్లు ప్రకటించేందుకు నిర్ణయం తీసుకుంది సర్కార్.. 2020లో పాస్ సర్టిఫికెట్లు ఇచ్చిన వారందరికీ గ్రేడ్ పాయింట్లు ఇవ్వాలని నిర్ణయానికి వచ్చారు..
అయితే, అంతర్గతంగా 50 మార్కుల చొప్పున నిర్వహించిన 3 ఫార్మెటివ్ అసెస్మెంట్ల ఆధారంగా ఈ గ్రేడ్లు ప్రకటించాలని హైపవర్ కమిటీ సూచించింది.. 2018, 2019 సంవత్సరాల్లో ఫెయిల్ అయ్యి 2020లో పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్ధులకు గతంలోని వారి సామర్ధ్యం ఆధారంగా 20 మార్కులకు లెక్కించి పరిగణించాలని పేర్కొంది.. 2021 విద్యా సంవత్సరంలోని విద్యార్ధులందరికీ అంతర్గత అసెస్మెంట్ మార్కులను 30 శాతానికి 70 శాతం వెయిటేజి స్లిప్ టెస్టులకు ఇవ్వాలని సిఫార్సు చేసింది హైపవర్ కమిటీ. అంతర్గత అసెస్మెంట్ పరీక్షలకు హాజరు కాని విద్యార్ధులకు పాస్ గ్రేడ్ ఇవ్వాలని సిఫార్సు చేసింది. వొకేషనల్ విద్యార్ధులకు ఎసెస్సీ పరీక్షల్లో వచ్చిన గ్రేడ్ల ఆధారంగా ఫలితాలు ఇవ్వనున్నారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి. రాజశేఖర్.