ఎన్నో రోజులుగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న పీఆర్సీ ప్రకటనపై నేడు తెరపడింది. ఈ రోజు సీఎం జగన్ 11వ పీఆర్సీని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఏపీ జేఏసీ అమరావతి సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. పదవీ విరమణ వయస్సు పెంపు ఊహించలేదని ఆయన అన్నారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైందని ఆయన అభివర్ణించారు. అంతేకాకుండా మేం అడగకపోయినా ఇంటి స్థలం విషయంలో నిర్ణయం తీసుకున్నారని ఆయన హర్షం వ్యక్తం చేశారు.
పెండింగ్ డీఏలపై సీఎం జగన్ నిర్ణయం సంతోషకరమన్నారు. మే కోరిన ప్రధాన సమస్యలన్నీ పరిష్కరించారన్నారు. ఆయనతో పాటు ఏపీ జేఏసీ అధ్యక్షుడు బండి శ్రీనివాస్ మాట్లాడుతూ.. హామీల అమలు ఉద్యోగ ఐకాసల ఉద్యమ ఫలితమేనన్నారు. మా 71 డిమాండ్లలో 50 ప్రధాన డిమాండ్లు పరిష్కరించారని, పదవీ విరమణ వయసు తెలంగాణ కంటే ఏడాది ఎక్కువే పెంచారని ఆనందం వ్యక్తం చేశారు. ఐకాస తరుఫున సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.