ఉత్తర ప్రదేశ్ లో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది. నగరాలు, పట్టణాల నుంచి ఇప్పుడు గ్రామాలకు వ్యాపించింది. గ్రామాల్లో కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. భారీ సంఖ్యలో కేసులు నమోదవుతుండటంతో ప్రజలు ఆందోళనలు చెందుతున్నారు.గ్రామాల్లో వైద్య సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉండటంతో వేలాది మందికి కరోనా సోకుతున్నది. ఉత్తర ప్రదేశ్ లోని భాగ్ పత్ జిల్లాలోని లంబా గ్రామంలో కరోనా విలయతాండవం చేస్తున్నది. లంబా గ్రామంలో 27 రోజుల వ్యవధిలో 36 మంది మృతి చెందారు. దీంతో ఆరోగ్యశాఖ అప్రమత్తం అయ్యింది. వెంటనే గ్రామంలో ఆరోగ్యశాఖాధికారులు సర్వే నిర్వహించారు. మరణించినవారు పెద్దవయసు కలిగిన వ్యక్తులు అని, అందరూ కరోనాతో మృతి చెందలేదని, వివిధ కారణాల వలన మృతి చెంది ఉంటారని ఆరోగ్యశాఖాధికారులు పేర్కొన్నారు.