తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట కలిగించే వార్తను ప్రభుత్వం అందించింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1,125 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి వైద్య ఆరోగ్య శాఖ సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రంలో మొత్తం 10 ప్రభుత్వ వైద్య కాలేజీలు ఉండగా.. వీటికి వచ్చే విద్యా సంవత్సరంలో కొత్తగా మరో 8 జత కానున్నాయి. దీంతో మొత్తం 18 కాలేజీల్లో సహాయ ఆచార్యులను నియమించనున్నారు.
Read Also: రాఘవ లారెన్స్ గొప్ప మనసు.. ‘సినతల్లి’కి ఇల్లు కట్టిస్తానని హామీ
కొత్తగా నెలకొల్పనున్న వైద్య కళాశాలల్లో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం పదోన్నతుల ప్రక్రియను చేపట్టింది. మరికొందరిని ప్రజారోగ్య సంచాలకులు, వైద్య విధాన పరిషత్ నుంచి విలీనం చేసుకున్నారు. ఇంకొందరిని సర్దుబాటు విధానంలో నియమించారు. కొత్త కాలేజీల్లో బోధన సిబ్బందిని పరిశీలించడానికి జాతీయ వైద్య కమిషన్ బృందం తెలంగాణలో వచ్చే జనవరిలో పర్యటించే అవకాశముంది. ఈ మేరకు నోటిఫికేషన్ త్వరలో వెలువడనున్నట్లు వైద్యవర్గాలు వెల్లడించాయి.