తెలంగాణ సీఎం కేసీఆర్పై సెటైర్లు వేశారు మాజీ ఎంపీ, బీజేపీ నేత విజయశాంతి.. సీఎం కేసీఆర్ అధికారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పనుల్ని తానే స్వయంగా చెకింగ్ చేస్తానని, చెప్పకుండా… చెయ్యకుండా వచ్చి పరిశీలిస్తానని అన్నారు. ఆఫీసర్లు అందుబాటులో ఉండి తానడిగిన రిపోర్టులివ్వాలని… తేడా వస్తే స్పాట్లోనే సస్పెన్షన్లు ఉంటాయని సీరియస్గా హెచ్చరించారని గుర్తుచేసిన ఆమె.. సీఎం మాటలకు భయపడాల్సిన పనిలేదని అధికారులకు బాగా తెలుసు అని ఎద్దేవా చేశారు.. ఎందుకంటే, ఆయన ఒక మాట అన్నారంటే… అది జరిగే పని కాదని అందరికీ తెలుసు. వస్తున్నా వస్తున్నా అనడమే గాని… ఓట్ల పండగప్పుడు తప్ప ఫాంహౌస్, ప్రగతి భవన్ వదిలి కేసీఆర్ రారని అందరికీ బాగా అర్థమైందన్నారు.
ఇక, నాగార్జునసాగర్ ఎన్నికలప్పుడు 15 రోజుల్లో మళ్ళీ సాగర్ వచ్చి అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానన్నారు… నెలన్నర దాటినా అతి గతీ లేదని ఫైర్ అయ్యారు విజయశాంతి.. అంతకు ముందు హుజుర్ నగర్ ఎన్నికలప్పుడు వచ్చి 15, 20 రోజుల్లో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ వరకు పర్యటించి అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానన్నారు… ఏడాదిన్నరైనా సారు అడ్రస్ లేడన్న ఆమె.. ఇక చాలా ఏళ్ళ కిందట వరంగల్ నగరం మురికివాడలకు వచ్చి… వారికి కొత్త ఇళ్ళు కట్టిస్తానని, దావత్ చేసుకోవడానికి 5 నెలల్లో మళ్లీ వస్తానని అన్నారు… ఏం జరిగిందో చెప్పక్కర్లేదన్నారు.. ఇక ఈ తాజా చెకింగులు, వార్నింగుల అర్థమేంటో నేను చెప్పాల్సిన పనిలేదు. ఆయన దర్శనం కావాలంటే మళ్ళీ అక్కడ ఓట్ల పండగ రావాలేమో… కాదు, తప్పదు అనుకుంటే ఏవో కొన్ని చోట్లకు వెళ్ళి ముఖం చూపించి తిరిగిరావడమే తప్ప, ఈ సీఎం గారు తన పనితీరుతో తెలంగాణను ఉద్ధరిస్తారంటే చిన్న పిల్లలు కూడా నమ్మే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు..