ఏపీ నుంచి హైదరాబాద్ వస్తున్న రోగుల అంబులెన్సులను సరిహద్దుల వద్దే అపేయడంపై బిజేపి నేత విజయశాంతి ఫైర్ అయ్యారు. ఈ విషయంలో తెలంగాణ సర్కార్ మానవత్వం లేకుండా వ్యవహరించిందని ఆమె మండిపడ్డారు. “వైద్యం కోసం ఏపీ నుంచి హైదరాబాద్ వస్తున్న రోగుల అంబులెన్సులను సరిహద్దుల వద్దే అపేసి ఏ మాత్రం మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్న తెలంగాణ పాలకుల తీరును అన్ని వర్గాలూ తప్పుబడుతున్నా ఈ సర్కారు స్పందించడం లేదు. ఆస్పత్రులలో బెడ్స్ కన్ఫర్మ్ చేసుకుని, అందుకు రుజువులు చూపిస్తున్నా అనుమతించకపోవడం దారుణం. ఈ విషయంలో తెలంగాణ సర్కారు వైఖరిని ఇటీవలే నాతో సహా విపక్షాలన్నీ ఖండించాయి. సరిహద్దుల్లో అంబులెన్సులను అపే విషయమై ప్రభుత్వం నుంచి ఆదేశాలున్నాయా… అన్న హైకోర్టు ప్రశ్నకు సైతం అధికారులు సరైన సమాధానం ఇవ్వలేకపోయారు. తెలంగాణ సర్కారు తీరుతో సరిహద్దుల వద్ద పలువురు రోగులు మృత్యుముఖానికి చేరువయ్యే పరిస్థితి నెలకొంది. ఈ దుస్థితికి గాను తెలంగాణ ముఖ్యమంత్రిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినా తప్పులేదు.” విజయశాంతి అంటూ పేర్కొన్నారు.