NTV Telugu Site icon

సిద్దిపేటలో డమ్మీ అభివృద్ధి.. బుడగ పగలడం ఖాయం..!

vijayashanthi

సిద్దిపేట అభివృద్ధిపై విమ‌ర్శ‌లు గుప్పించారు మాజీ ఎంపీ, బీజేపీ నేత విజ‌య‌శాంతి… సిద్దిపేట లో ప్రజాస్వామ్యం ఉందా లేక నిరంకుశ నిజాం రాజ్యం నడుస్తోందా.? అని ప్ర‌శ్నించిన ఆమె.. సర్కార్ హాస్పిటల్ లో పరిస్థితులను పరిశీలించడానికి వెళ్తే బీజేపీ మహిళా మోర్చా నాయకురాళ్లపై నాన్ బెయిలబుల్ కేసులు పెడతారా..? అని ప్ర‌శ్నించారు.. కోవిడ్ నిబంధనలకు లోబడి పీపీఈ కిట్స్‌ వేసుకుని ఆస్ప‌త్రిలోకి వెళ్తే.. డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ కింద కేసులు బనాయిస్తారా? రోజు లాక్ డౌన్ ను ఉల్లంఘిస్తున్న వాళ్లపై ఎంత మంది పై కేసులు పెట్టి కోర్టు ముందు ప్రవేశ పెట్టారు..? అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.. ఇక‌, సిద్దిపేట అభివృద్ధి, హరీష్ రావు చెప్పుకుంటున్న అభివృద్ధి అంత డొల్ల అని తేలిపోయింద‌న్న రాముల‌మ్మ‌.. సిద్దిపేటలో జ‌రిగింది డమ్మీ అభివృద్దే.. ఆ బుడగ త్వరలో పగలడం ఖాయం అని కామెంట్ చేశారు.

సిద్దిపేట ఆస్ప‌త్రిల్లో కరోనా బాధితుల‌ను పట్టించుకోవ‌డం లేద‌ని వాళ్ల బంధువులు, టీఆర్ఎస్ నేత‌లే వీడియో మెసేజ్ లు పెట్టార‌న్నారు రాముల‌మ్మ‌.. సిద్దిపేట సర్కార్ దవాఖానకు పోతే చచ్చినట్లే అని పేషేంట్ల బంధువులు చెబుతుంటే.. అక్కడి చిన్న దొరకు, ఫామ్ హౌజ్‌లోని పెద్ద దొరకు వినిపించడం లేదా? అని ప్ర‌శ్నించారు. వాస్తవాలు చూసేందుకు హాస్పిటల్ కు వెళ్లిన సిద్దిపేట జిల్లా బీజేపీ మహిళ మోర్చా అధ్యక్షురాలు అరుణా రెడ్డి, ప్రధాన కార్య దర్శి పద్మ గౌడ్ పై కేసులు పెట్టిస్తారా? ఇది అరాచక పాలనకు నిదర్శనం అని పేర్కొన్నారు.. ఇక‌, పీపీఈ కిట్ లేకుండా గాంధీ, ఎంజీఎం లో తిరిగిన సీఎం కేసీఆర్‌ పై ఏం కేసు పెట్టాలి? అని నిల‌దీసిన విజ‌య‌శాంతి.. క‌రోనాను వెంట‌నే ఆరోగ్య శ్రీలో చేర్చాలి.. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలి అని డిమాండ్ చేశారు.