NTV Telugu Site icon

Tollywood: చిరంజీవి నివాసానికి వెళ్లిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని మెగాస్టార్ చిరంజీవి నివాసానికి వెళ్లారు. ఉగాది సందర్భంగా కేంద్ర సాంస్కృతిక శాఖ నిర్వహించే 12వ రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్ జాతీయ ఉత్సవాలకు చిరంజీవిని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆహ్వానించారు. ఈ ఉత్సవాలు ఏప్రిల్ 1 నుంచి 3 వరకు జరగనున్నాయి. ఈ రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్‌లో వివిధ రాష్ట్రాలకు చెందిన జానపద, గిరిజన కళారూపాలు, నృత్యాలు, సంగీతం, వంటకాలు, సంస్కృతులు దర్శనమివ్వనున్నాయి.

ఈ నేపథ్యంలో కిషన్‌రెడ్డి తన నివాసానికి వచ్చిన విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 12వ రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్ జాతీయ ఉత్సవాలకు కిషన్‌రెడ్డి తనను ఆహ్వానించడంపై కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ వేడుకల్లో పాల్గొనే అవకాశం దక్కడం తనకు లభించిన గౌరవంగా భావిస్తానని చిరంజీవి పేర్కొన్నారు. కళాకారులకు జీవనోపాధి దృష్ట్యా ఇలాంటి కార్యక్రమం వారికి గొప్ప వేదిక అవుతుందని చిరంజీవి అభిప్రాయపడ్డారు. అటు కిషన్ రెడ్డి తన నివాసానికి రావడం పట్ల చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు.