మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంచలన కామెంట్లు చేశారు. చిల్లర వ్యక్తుల గురించి పట్టించుకోవద్దు..ఓపిక పడితే రాజులు అవుతారు అన్నారు తుమ్మల. రాజకీయాల్లో కావలసింది ఓపిక… ఓపిక పడితే కార్యకర్తలే రాజులు అవుతారన్నారు. అందువల్ల కార్యకర్తలు ఓపిక తో వ్యవహరించాలని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
పాలేరు నియోజకవర్గంలో కార్యకర్తల తో ఆయన మాట్లాడుతూ పరోక్షంగా పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి నుద్దేశించి వ్యాఖ్యానించారు. మనల్ని ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని, అయితే మనం పార్టీలో ఉన్నందున ఎక్కడా తొందర పడవద్దు, మీరు ఎవ్వరిని ఇబ్బంది పెట్టవద్దని కార్యకర్తలను కోరారు.
చిల్లర వ్యక్తులు చేసే చిల్లర కార్యక్రమాలకు స్పందించవద్దని ఎదుటి వారు చేసే చిల్లర చేష్టలను పట్టించుకోవద్దని తుమ్మల అన్నారు. చిల్లర వ్యక్తులను పట్టించుకుంటే మన పరువు పోతుందని తుమ్మల అన్నారు. మన ప్రజల కోసం మన పార్టీ కోసం పని చేద్దామని చెప్పారు. నేను పదవి లో వున్నప్పుడు కూడా ప్రతి పక్ష పార్టీలకు సంబంధించిన వారిపై ఎటువంటి వివక్ష చూపించలేదన్నారు. ఇప్పుడు స్వంత పార్టీ వారికే వేధింపులు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారి వేధింపు చర్యలను వారి విజ్ఞతకే వదిలేద్దామని అన్నారు. మనకు మంచి రోజులు వస్తాయని అన్నారు. శుభకృత నామ ఉగాది సందర్భంగా అందరికీ శుభకాంక్షలు తెలుపుతూ.. అందరికి శుభం జరుగుతుందని తుమ్మల అన్నారు.