TS Inter Results: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రథమ, ద్వితీయ ఫలితాలను విడుదల చేశారు. నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఫలితాల కోసం ntvtelugu.com వెబ్సైట్ను కూడా సంప్రదించవచ్చు. రాష్ట్రంలో ఈ ఏడాది మార్చి 15 నుంచి ఏప్రిల్ 5 వరకు నిర్వహించిన ఇంటర్ పరీక్షలకు 9.47 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫస్టియర్ 4,33,082 మంది హాజరు కాగా 2,72,208 మంది ఉత్తీర్ణులయ్యారు. ఫస్టియర్లో 62.85 శాతం ఉత్తీర్ణత నమోదైంది. సెకండియర్లో 3,80,920 మంది హాజరు కాగా 2,56,241 మంది ఉత్తీర్ణత సాధించి 67.27 శాతం నమోదైంది. ఇంటర్మీడియెట్ లో ఫస్టియర్ లో 63.85 శాతం ఉత్తీర్ణత కాగా.. అమ్మాయిలు 68.85 శాతం పాస్ అయ్యారు. ఇక అబ్బాయిలు 56.80 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక సెకండియర్ లో 67.26 శాతం పాస్ అయ్యారు. సెకండియర్ లో అమ్మాయిలు 73.46 శాతం పాస్ అయ్యారు. ఇక అబ్బాయిలు 60.66 శాతం పాస్ అయ్యారు.
ఈరోజు 2022-23 ఫలితాలను విడుదల చేసామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మార్చి 15 నుంచి పరీక్షలు నిర్వహించామని, విద్యార్థి దశలో ఇంటర్ కీలకమన్నారు. జీవితానికి టర్నింగ్ పాయింట్ అని తెలిపారు. మన రాష్ట్రంలో ప్రథమ, ద్వితీయ పరీక్షలకు 9,45,153 మంది హాజరయ్యారని తెలిపారు. 1473 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించామన్నారు. 26 వేల మంది సేవలందించారని తెలిపారు. పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించిన అన్ని శాఖలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఎంసెట్ విషయంలో ఇంటర్ వెయిటేజీ తొలగిస్తున్నట్లు ప్రకటించారు. పిల్లలెవరూ ఒత్తిడికి గురికాకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు.