తెలంగాణలో తాజాగా కొన్ని రాజకీయ పరిణామలు చోటు చేసుకున్నాయి.. టీఆర్ఎస్కు గుడ్బై చెప్పి.. బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు మాజీ మంత్రి ఈటల రాజేందర్, మరికొందరు నేతలు.. ఇక, త్వరలో మరిన్ని చేరికలు ఉంటాయని వారి మాటల ద్వారా తెలుస్తోంది.. మరోవైపు.. టి.టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ.. టీఆర్ఎస్లో చేరతారనే ప్రచారం కూడా సాగుతోంది..అయితే, ఈ ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కూతురు కవిత.. ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.. జగిత్యాల పర్యటనలో ఉన్న ఆమె.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో సమీకరణాలు మారుతాయంటూ హాట్ కామెంట్లు చేశారు.. ఇంట్రెస్టింగ్ రాజకీయాలు జరుగుతాయన్న ఆమె.. ఏది జరిగినా అది టీఆర్ఎస్ పార్టీ మంచికే జరుగుతుందని వ్యాఖ్యానించారు.. మరోవైపు రాష్ట్రంలో అనేక అంశాలు చర్చకు వస్తాయన్న ఆమె.. ఇంతకు మించి ఇప్పుడు ఏమీ మాట్లాడను అన్నారు. దీంతో.. తెలంగాణలో పెద్ద ఎత్తున రాజకీయ సమీరణలు మారుతాయనే చర్చ మళ్లీ మొదలైంది.. అంటే మరికొందరు నేతలు… కారెక్కుతారా..? లేదా కొన్ని గుసగుసలు వినిపిస్తున్నట్టు.. మరికొందరు నేతలను ఉద్వాసన తప్పదా? అనే చర్చ మొదలైంది. అయినా, రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే.. ఎమ్మెల్సీ కవిత చెబుతున్న ఆ సమీకరణాలు ఏంటో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే మరి.