లింగోజిగూడ డివిజన్ కు జరగనున్న ఉప ఎన్నికల్లో ఏకగ్రీవ ఎన్నిక కోసం బీజేపీ విజ్ఞప్తి మేరకు పోటీకి దూరంగా ఉండాలని టీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. ఇటీవల జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో లింగోజిగూడ డివిజన్ నుంచి ఎన్నికైన బీజేపీ కార్పొరేటర్ శ్రీ ఆకుల రమేష్ గౌడ్ ప్రమాణ స్వీకారం కూడా చేయకుండా మృతి చెందారు. ఈ డివిజన్ కు ఏప్రిల్ 30 నాడు జరగనున్న ఉప ఎన్నికల్లో రమేష్ గౌడ్ కుమారుడు పోటీ చేస్తున్నందున ఆయన ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యేందుకు సహకరించాలని బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు నేతృత్వంలో ఒక ప్రతినిధి బృందం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని ఇవాళ ప్రగతి భవన్ లో కలిసి విజ్ఞప్తి చేసింది. ఈ సమావేశంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, స్వర్గీయ ఆకుల రమేష్ గౌడ్ సతీమణి, కుమారుడు, ఇరు పార్టీల నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ప్రమాణ స్వీకారం కూడా చేయకముందే ఆకుల రమేష్ గౌడ్ మరణించడం దురదృష్టకరం అని, వారి అకాల మరణం వల్ల వచ్చిన ఈ ఎన్నికల్లో పోటీ పెట్టొద్దు అని బీజేపీ నుంచి వచ్చిన విజ్ఞప్తిని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్దృష్టికి తీసుకువెళ్ళి వారి సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం అని తెలిపారు. మానవతా దృక్పథంతో ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి బీజేపీ ప్రతినిధి బృందం, స్వర్గీయ ఆకుల రమేష్ గౌడ్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక లింగోజిగూడ డివిజన్ ఏకగ్రీవం కోసం కాంగ్రెస్ నేతలను కూడా బీజేపీ బృందం కలిసినట్టు సమాచారం. దీనికి కాంగ్రెస్ నేతలు సైతం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి లను కలవగా వారు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.