సెకండ్ వేవ్లో కరోనా కేసులు పెరగడంతో నెలక్రితం లాక్డౌన్ విధించించింది తెలంగాణ ప్రభుత్వం. నిత్యావసర సరుకుల కోసం కొంత సమయం మినహాయింపు తప్పా.. విద్యాసంస్థలు పూర్తిగా మూతపడ్డాయి. ఆ తరువాత దశల వారీగా సడలింపులు ఇచ్చింది. తాజాగా కరోనా కేసులు రోజు రోజుకు తగ్గుతుండడంతో.. లాక్డౌన్ ఎత్తేసింది ప్రభుత్వం. ఆల్ ఓపెన్ అంటూనే.. జులై ఒకటో తేదీ నుంచి విద్యా సంస్థలను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. ఇందు కోసం విధి విధానాలను కూడా రూపొందించాలని విద్యాశాఖను ఆదేశించింది. మరో ఆరేడు వారాల్లో కరోనా థర్డ్వేవ్ తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లలపై దీనిపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని గతంలో వార్తలు వచ్చాయి. ఇలాంటి సమయంలో విద్యాసంస్థల పున:ప్రారంభంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు.
ప్రస్తుతం దేశంలో 18 ఏళ్లు పైబడ్డ వారికే వ్యాక్సిన్ ఇస్తున్నారు. పిల్లలపై ఇంకా ట్రయల్స్ కొనసాగుతూనే ఉన్నాయి. చిన్నారులకు ఎప్పుడు టీకా అందుబాటులోకి వస్తుందో చెప్పలేని పరిస్థితి. దీంతో పిల్లలకు టీకా ఇవ్వడం ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. దీనికి తోడు మూడో దశ కరోనా విద్యార్థుల తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తోంది. కరోనా తగ్గాకే పిల్లలను స్కూల్స్కి పంపిస్తామంటున్నారు. స్కూళ్లు, కాలేజీలు తెరవాలన్న ప్రభుత్వ నిర్ణయంపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. థర్డ్వేవ్ ముప్పుందని హెచ్చరిస్తున్నా.. విద్యాసంస్థలను ఎలా తెరుస్తారని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జులై ఒకటి నుంచి విద్యా సంస్థలను ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళనను పరిగణలోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది.