ఇటీవల జరిగిన తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిసిన సంగతి తెలిసిందే. తాజాగా టిఎఫ్సిసి ఛైర్మన్ ప్రతాని రామకృష్ణగౌడ్ తో పాటు, తెలంగాణ ‘మా’ ప్రెసిడెంట్ రష్మి ఠాకూర్, టిఎఫ్సిసి వైస్ ఛైర్మన్ నెహ్రు, డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రమేష్ నాయుడు తదితరులు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ను వారి కార్యాలయంలో కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. పదివేల మంది సభ్యులున్న తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగినందుకు, సభ్యుల మధ్య ఉన్న ఐక్యమత్యాన్ని, ముందుండి దిశానిర్దేశం చేస్తున్న ఛైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ ను గవర్నర్ అభినందించారు. ఇదే సమయంలో తెలంగాణ చిత్ర పరిశ్రమలోని సమస్యలను టిఎఫ్సిసి ఛైర్మన్ గవర్నర్కు విన్నవించారు. ముఖ్యంగా ఇండస్ట్రీ అభివృద్ధి కోసం నిర్మాతలకు, థియేటర్లకు జీఎస్టీ మినహాయించాలని కోరారు. ఈ సమస్యలపై గవర్నర్ తమిళిసై సానుకూలంగా స్పందించారు. తెలంగాణ చిత్ర పరిశ్రమల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అభివృద్ధి దిశగా చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. తమ విలువైన సమయాన్ని కేటాయించి టిఎఫ్సిసి కార్యవర్గాన్ని అభినందించినందుకు ఛైర్మన్ ప్రతాని రామకృష్ణగౌడ్ గవర్నర్ తమిళిసై కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.