తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై క్లారిటీ ఇచ్చింది కేంద్రం.. ఏపీ, తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజన ఇప్పట్లో లేనట్టే అని తెలిపారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్… రాజ్యాంగంలోని ఆర్టికల్ 170లో చెప్పినట్లు 2026 తర్వాత ప్రచురించే జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని స్పష్టం చేశారు.. అయితే, ఈ వ్యవహారంపై స్పందించిన తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్.. కేంద్రానికి మనసుంటే మార్గం ఉంటుందన్నారు.. 2014 రాష్ట్ర విభజన చట్ట సవరణ అనేది చిన్న అంశమన్న వినోద్.. ఈ చట్ట సవరణతోనే కదా ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలిపారు..? మరి అసెంబ్లీ సీట్ల పెంపు విషయంలో ఎందుకు సవరణ చేయరు? అని ప్రశ్నించారు.. నియోజకవర్గాల పునర్విభజనఫై పాత చింతకాయ సమాధానాలు కట్టిపెట్టండి అంటూ కౌంటర్ ఇచ్చారు బోయినపల్లి వినోద్ కుమార్.