Rythu Bharosa : తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వానాకాలం సీజన్కు గాను ‘రైతు భరోసా’ నిధుల విడుదలలో సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం 5 రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 67.44 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 7,135.77 కోట్ల నిధులను నేరుగా జమ చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ప్రతి అర్హులైన రైతుకు పెట్టుబడి సాయాన్ని అందజేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఆరో రోజున 6 ఎకరాల లోపు రైతులకు నిధులు
అధికారిక నివేదికల ప్రకారం, నిధుల విడుదలలో భాగంగా 5వ రోజున (04-07-2026) 5 నుంచి 6 ఎకరాల వరకు సాగుభూమి కలిగిన 1.68 లక్షల మందికి పైగా లబ్ధిదారులైన రైతుల ఖాతాల్లో రూ. 545.40 కోట్లను ప్రభుత్వం విజయవంతంగా జమ చేసింది. జూన్ 30న ప్రారంభమైన ఈ పెట్టుబడి సాయం పంపిణీ ప్రక్రియ.. ప్రతిరోజూ భూమి విస్తీర్ణం వారీగా క్రమబద్ధంగా సాగుతూ కేవలం ఐదు రోజుల్లోనే 6 ఎకరాల పరిధి వరకు ఉన్న రైతులందరికీ చేరింది.
రికార్డు స్థాయిలో సాగిన పెట్టుబడి సాయం పంపిణీ
మొదటి రోజున ఒక ఎకరం , రెండు ఎకరాల లోపు ఉన్న దాదాపు 44.27 లక్షల మంది రైతులకు రూ. 2,482 కోట్లకు పైగా నిధులను విడుదల చేయడంతో ఈ ప్రక్రియ ప్రారంభమైంది. ఆ తర్వాతి రోజుల్లో వరుసగా 3 ఎకరాలు, 4 ఎకరాలు, , 5 ఎకరాల వరకు సాగుభూమి కలిగిన లక్షలాది మంది రైతుల ఖాతాల్లో విడతల వారీగా వందలాది కోట్ల రూపాయలను ప్రభుత్వం జమ చేసుకుంటూ వచ్చింది. ఈ విధంగా మొత్తం 1.18 కోట్లకు పైగా ఎకరాల సాగుభూమికి సంబంధించి రికార్డు స్థాయిలో నిధులను వేగంగా అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లోకి చేర్చడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది.

