Telangana : పునర్ వ్యవస్థీకరించిన జీహెచ్ఎంసీతో పాటు ఫ్యూచర్ సిటీతో కలిపి పోలీస్ వ్యవస్థను నాలుగు కమిషనరేట్లుగా విభజిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 9న రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో 2047 విజన్ డాక్యుమెంట్ ను విడుదల చేయడం జరిగింది. 2047 నాటికి తెలంగాణ రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చి దిద్దేందుకు పలు చర్యలు తీసుకుంది. దీనిలో భాగంగా రాష్ట్రాన్ని క్యూర్(CURE), ప్యూర్(PURE), రేర్(RARE) అని మూడు భాగాలుగా విభజించి, ప్రతీ ప్రాంతానికి ఒక ప్రత్యేక వ్యూహం, ప్రణాళికతో ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రానికి అతి ముఖ్యమైన ఓఆర్ఆర్ లోపలి 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో కలుపుతూ చట్టపరమైన మార్పులు చేసింది. ఈ వ్యూహం ద్వారా ఈ ప్రాంతంలో ఒక ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంది. జీహెచ్ఎంసీ ప్రాంతాన్ని 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులుగా పునర్ వ్యవస్థీకరించారు. ఇదే విధంగా ఇతర శాఖలను పునర్ వ్యవస్థీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రజలకు మెరుగైన సేవలు, శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణలో భాగాంగా పోలీస్ వ్యవస్థను నాలుగు కమిషనరేట్లుగా విభజిస్తూ నిర్ణయం తీసుకుంది. గతంలో ఉన్న మూడు కమిషనరేట్లను పునర్ వ్యవస్థీకరిస్తూ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్ గిరి, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లను ఏర్పాటు చేశారు.
అసెంబ్లీ, సెక్రటేరియట్, బేగంపేట, శంషాబాద్ ఎయిర్ పోర్టు, బుద్వేల్ హైకోర్టు లాంటి కీలక ప్రాంతాలను హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి తీసుకొచ్చారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న IT ప్రాంతాలు గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్ రామ్ గూడ, మాదాపూర్, రాయదుర్గ్, పారిశ్రామిక ప్రాంతాలు పఠాన్ చెరు, జీనోమ్ వ్యాలీ, RC పురం, అమీన్ పూర్ తదితర ప్రాంతాలు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉండనున్నాయి.
రాచకొండ కమిషనరేట్ ను పునర్ వ్యవస్థీకరించి మల్కాజ్ గిరి పేరుతో కొత్త కమిషనరేట్ ను ఏర్పాటు చేశారు. కీసర, శామీర్ పేట, కుత్భుల్లాపూర్, కొంపల్లి తదితర ప్రాంతాలు ఈ కమిషనరేట్ పరిధిలోకి వస్తాయి. ఇప్పటి వరకు రాచకొండ పరిధిలో ఉన్న భువనగిరిని ప్రత్యేక పోలీస్ యూనిట్ గా ఏర్పాటు చేసి యాదాద్రి భువనగిరి జిల్లాకు ఎస్పీని నియమించనున్నారు.
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఫ్యూచర్ సిటీ కోసం కొత్త కమిషనరేట్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. చేవెళ్ల, మొయినాబాద్, శంకర్ పల్లి, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, తదితర ప్రాంతాలు ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలోకి తీసుకు వచ్చారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నాలుగు కమీషనరేట్లకు పోలీస్ కమిషనర్లను, యాదాద్రి భువనగిరి జిల్లాకు ఎస్పీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.