Site icon NTV Telugu

Half-Day Schools: మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు

Half Day School

Half Day School

పెరుగుతున్న ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ , ప్రైవేట్ పాఠశాలలకు వచ్చే నెల మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు (Half-Day Schools) ప్రారంభం కానున్నట్లు విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ వెల్లడించారు. ఈ కొత్త నిబంధనల ప్రకారం, పాఠశాలలు ఉదయం 8:00 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:30 గంటల వరకు మాత్రమే కొనసాగుతాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు మధ్యాహ్నం 12:30 గంటలకు భోజనం వడ్డించి, ఆ తర్వాత వారిని ఇంటికి పంపిస్తారు.

Maruti Suzuki Brezza: మారుతి సుజుకి బ్రెజ్జా కొనాలనుకుంటున్నారా.. మరికొన్ని రోజులు ఆగండి..

అయితే, పదో తరగతి పరీక్షా కేంద్రాలుగా ఉన్న పాఠశాలల పని వేళల్లో విద్యాశాఖ స్వల్ప మార్పులు చేసింది. బోర్డు పరీక్షలు ఉదయం పూట జరుగుతున్నందున, అటువంటి పాఠశాలల్లో తరగతులు మధ్యాహ్నం 1:00 గంట నుండి సాయంత్రం 5:00 గంటల వరకు నిర్వహిస్తారు. పదో తరగతి విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక తరగతులు (Special Classes) పరీక్షల సమయం వరకు యధావిధిగా కొనసాగుతాయి. మరోవైపు, పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఉర్దూ మీడియం పాఠశాలలు , డైట్ కళాశాలలకు ప్రత్యేక సమయాలను కేటాయించారు. ఇవి ఫిబ్రవరి 19 నుంచి మార్చి 20 వరకు ఉదయం 8:00 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు పనిచేస్తాయి. ఈ సమయంలో తగ్గిన పని గంటలను భర్తీ చేసేందుకు మార్చి 20 తర్వాత అదనపు తరగతులు నిర్వహించనున్నారు.

వేసవి సెలవుల షెడ్యూల్‌ను కూడా విద్యాశాఖ ఇప్పటికే ఖరారు చేసింది. ప్రస్తుత విద్యాసంవత్సరానికి చివరి పనిదినం ఏప్రిల్ 23 కాగా, ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు రాష్ట్రవ్యాప్తంగా వేసవి సెలవులు అమలులో ఉంటాయి. తిరిగి కొత్త విద్యా సంవత్సరం (2026-27) జూన్ 12 నుంచి ప్రారంభమవుతుంది. ఎండల తీవ్రత నుంచి విద్యార్థులను రక్షించేందుకు విద్యాశాఖ తీసుకున్న ఈ నిర్ణయాన్ని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గమనించాలని అధికారులు సూచించారు.

T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్‌లో సంచలనం.. ఆస్ట్రేలియాను తేరుకోలేని దెబ్బకొట్టిన జింబాబ్వే!

Exit mobile version