తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ముమ్మరంగా ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి.. ఇప్పటికే 4 .61 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు అధికారులు.. ఇక, రాష్ట్రంలో యాసంగి ధాన్యం సేకరణ, కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్.. పౌరసరఫరాలు, మార్కెటింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు సవ్యంగా ఏవిధమైన ఇబ్బందులు లేకుండా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటివరకు 4 .61 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని, 61,300 మంది రైతుల నుండి 3,679 కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించినట్టు వెల్లడించారు. ఇక, ప్రస్తుతం 7.80 కోట్ల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు.. మరో 8 కోట్ల గన్నీ బ్యాగుల కొనుగోలు టెండర్ల ప్రక్రియ నేడు పూర్తవుతుందని.. వీటికితోడు మరో రెండున్నర కోట్ల గన్నీ బ్యాగులను జ్యుట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుండి త్వరలోనే అందుతాయని చెప్పారు.
Read Also: Bandi Sanjay: సరూర్ నగర్ పరువుహత్యపై మండిపాటు
రాష్ట్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ఇతర రాష్ట్రాలనుండి అక్రమంగా ధాన్యం రాకుండా ఉండేందుకుగాను ఇతర రాష్ట్రాలనుండి సరిహద్దుగల 17 జిల్లాల సరిహద్దుల్లో 51 చెక్ పోస్టులను ఏర్పాటు చేశామని వివరించారు సీఎస్ సోమేష్ కుమార్.. సేకరించిన ధాన్యం వివరాలను వెంటనే అప్లోడ్ చేయాలని తద్వారా చెల్లింపులు త్వరితగతిన జరిగే అవకాశం ఉంటుందన్నారు. ధాన్యం సేకరణకు నిధుల సమస్యే లేదని ఇప్పటికే, రైతులకు చెల్లింపులు చేయడానికి రూ. 5000 కోట్లను ప్రభుత్వం ప్రత్యేకంగా కేటాయించిందని స్పష్టం చేశారు. సేకరించిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు పంపడం జరుగుతుందని, నేటి వరకు 4 .3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు పంపామని వెల్లడించారు. వరంగల్. గద్వాల్, వనపర్తి, భూపాల్ పల్లి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వరి కోతలు ఆలస్యంగా అవుతాయని, వరి కోతలు ప్రారంభం కాగానే ఆయా జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు సీఎస్ సోమేష్ కుమార్.